TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇక వెళ్లొస్తా.. పేర్ని నాని ముందస్తు వీడ్కోలు..

Published on: Tue Apr 5, 2022 11:07AM

ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ముహూర్తం దగ్గర పడింది. మరో ఐదారు రోజుల్లో, ఏప్రిల్ 11న కొత్త మంత్రివర్గం కొలువు తీరనుండి. అదే రోజున  గత మూడేళ్ళుగా మంత్రులుగా ఓ వెలుగు వెలిగిన మంత్రుల పేర్ల ముందు మాజీ వచ్చి చేరుతుంది. బుగ్గకారు బై బై చెప్పేస్తుంది. మంత్రి మాములు ఎమ్మెల్యే అయిపోతారు. శతకోటిలో తానూ ఒకరై పోతారు. ఈ నేపధ్యంలో రేపటి మాజీల మనోభావాలు ఎలా ఉంటాయో, వేరే చెప్పనక్కర లేదు. అయితే, అందరి మాట ఎలా ఉన్నా, రవాణా మంత్రి పేర్ని నాని మాత్రం, అందుకు మానసికంగా తయారైనట్లే కనిపిస్తున్నారు. ఆయన తమ మంత్రిత్వ శాఖతో సంబంధం ఉన్నలారీ, బస్సు యజమానుల సంఘాల సభ్యులకు ముందుగానే   వీడ్కోలు కూడా చెప్పేశారు.  

బస్‌ అండ్‌ కార్‌ ఆపరేటర్స్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఏపీ, తెలంగాణ బస్‌ ఆపరేటర్ల అసోసియేషన్ల ఆధ్వర్యంలో ‘వన్‌ ఇండియా, వన్‌ బస్‌’ వెబ్‌సైట్‌ను మంత్రి విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా, ఆయన, మనసులోని బాధని మరో రూపంలో బయట పెట్టుకున్నారు. ‘ఈనెల 11 న కొత్త మంత్రులు వస్తున్నారు’ అని చెప్పిన నాని, అయినా తాను మాజీ అయినా, రవాణా మంత్రిగా ఎవరు వచ్చినా,  తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు కొత్త మంత్రితో పంచుకుంటానని చెప్పుకొచ్చారు. మూడేళ్ల పాటు లారీలు, బస్సు యజమానుల సంఘాలతో కలిసి పనిచేసినవాడిగా మీ సమస్యలను కొత్త రవాణా మంత్రి వద్దకు, అవసరమైతే సీఎం వద్దకు తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తానని, హమీ ఇచ్చారు. 

అయితే, ఈ అసోసియేషన్లతో ఇదే చివరి సమావేశం అనుకుంటున్నా, అన్నప్పుడు మాత్రం ఆయన గొంతు కాసింత జీర పోయింది. అయితే, నిజానికి నాని ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నారో కానీ, మాజీలు అయిన మా పవర్ తగ్గదని, చెప్పడం ఆయన ఉద్దేశమా, అని వెహికల్ ఓనర్స్ గుసగుసలు పోతున్నారు. ఆలాగే, నడరు కాకపోయినా, ముఖ్యమంత్రితో మంచి అనుబంధం ఉన్న నాని వంటి మాజీలు సూపర్ మంత్రులుగా పనిచేస్తారా, ఏంటి అనే రాజకీయ చర్చకు నాని వాఖ్య శ్రీకారం చుట్టింది అంటున్నారు   

అదలా ఉంటే, ఇదే సమయంలో మంత్రి పేర్ని నాని, ఈ మూడేళ్ళలో రవాణా శాఖ అధికారులతో తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. మంత్రి పదవి చేపట్టిన సమయంలో, ‘రవాణా శాఖలో ఎవరి మాటా వినని ముగ్గురు సీతయ్యలు కృష్ణబాబు (ముఖ్యకార్యదర్శి) సీతారామాంజనేయులు,( కమిషనర్‌) సురేంద్రబాబు (ఆర్టీసీ ఎండీ)గా ఉన్నారని,  తెలిసి కాసింత ఖంగు తిన్నానని సరదాగా చెప్పుకొచ్చారు. రాకరాక మంత్రి పదవి వస్తే.. ఇదేమిటి అనుకున్నాను. వీళ్లు ముగ్గురూ ఎవరి మాటా వినరు.. వీళ్లు రాజకీయ నేతలను, మంత్రులు, ఎమ్మెల్యేలను లెక్కచేయరు. హెడ్‌ స్ట్రాంగ్, టఫ్‌గా ఉంటారని చెప్పేవారు. కానీ వారు ఎప్పుడూ అలా వ్యవహరించలేదు. నేను ఏది చెప్పినా ఎంతో పాజిటివ్‌గా స్పందించేవారు’ అంటూ  అధికారులకు కూడా మంత్రి పేర్ని నాని కృతజ్ఞతలు చెప్పారు.  తమ మనసులోని బాధను,భావాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తానూ ఒకప్పుడు, బస్సు ఆపరేట్ చేశానని, బస్సు, లారీ ఆపరేటర్ల కష్టాలు తనకు  కూడా తెలుసునని చెప్పారు. హోం, స్టేట్‌ ట్యాక్స్‌ విషయంలో రాష్ట్రంలో ‘వన్‌ ఇండియా వన్‌ ట్యాక్స్‌’ విధానం ద్వారా వెళ్దామని ముఖ్యమంత్రికి చెప్పానని, అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని మంత్రి నాని తుది పలుకులు పలికారు.