TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంత్రి లోకేష్ ఓఎస్డీ రెండు స్వర్ణ పతకాలు.. ఎందుకంటే?

Published on: Thu Jun 11, 2026 9:40AM

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఓఎస్డీ.. విద్యారంగంలో చూపిన ప్రతిభకు గాను రెండు స్వర్ణ పతకాలు సాధించారు. మంత్రి నారా లోకేష్ ఓఎస్డీగా పని చేస్తున్న డాక్టర్  కాశిరెడ్డి వరప్రసాద్  ఆర్థిక శాస్త్రంలో  పీహెచ్‌డీ పరిశోధనకు గాను ఈ ప్రతిష్ఠాత్మక స్వర్ణ పతకాలను సాధించారు.  తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహించిన ఉమ్మడి స్నాతకోత్సవ వేడుకల్లో డాక్టర్ కాశిరెడ్డి వరప్రసాద్ కు ఈ గౌరవం దక్కింది.  ఒక పక్క ప్రభుత్వ ఉన్నతాధికారిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే..  మరోపక్క సమాజానికి ఉపయోగపడే ఆర్థిక పరిశోధనలు చేసి ప్రతిభను చాటుకున్న ఆయనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం   నిర్వహించిన 63 నుంచి 68  ఉమ్మడి స్నాతకోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్  ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా డాక్టర్ కాశిరెడ్డి వరప్రసాద్ ఈ స్వర్ణ పతకాలను అందుకున్నారు.  విద్యా రంగంలో అత్యున్నత ప్రమాణాలను కనబరిచినందుకు గాను ఆయనకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గోల్డ్ మెడల్, ప్రొఫెసర్  డీఎల్ నారాయణ మెమోరియల్ పీహెచ్‌డీ గోల్డ్ మెడల్' లభించాయి. ఒకే వేదికపై  డాక్టర్ కాశిరెడ్డి వరప్రసాద్ రెండు ప్రతిష్టాత్మక పతకాలను అందుకోవడం విశేషం. 

డాక్టర్ వరప్రసాద్ ఎంచుకున్న పరిశోధనా అంశం ప్రస్తుత ఆధునిక నగరాల అభివృద్ధికి ఎంతో కీలకం. పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్లు, తాగునీటి సరఫరా వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనకు మున్సిపల్ బాండ్ల ద్వారా నిధుల సమీకరణ ఎలా చేయవచ్చు అన్న  అంశంపై ఆయన  పరిశోధన చేశారు. ఈ ఆర్థిక విధానాన్ని అటు ప్రభుత్వాలకు భారం కాకుండా, ఇటు పెట్టుబడిదారులకు  లాభదాయకంగా ఎలా మార్చవచ్చో ఆయన తన పీహెచ్ డి సిద్ధాంత గ్రంథంలో విశ్లేషణాత్మకంగా పేర్కొన్నారు.   దేశ ఆర్థిక ప్రగతికి, పట్టణాల రూపురేఖలు మార్చడానికి ఈ పరిశోధన ఎంతో దోహదపడుతుందని విద్యారంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. 

డాక్టర్ కాశిరెడ్డి వరప్రసాద్ కేవలం విద్యావేత్త మాత్రమే కాదు, ప్రభుత్వ పాలనలో ఎంతో అనుభవం ఉన్న అధికారి. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఆర్థిక శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా సేవలు అందిస్తూనే.. డిప్యూటేషన్‌పై మంత్రి నారా లోకేష్ వద్ద ఓఎస్డీగా   కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.    గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పులకు సంబంధించిన ఆర్థిక గణాంకాలపై మీడియాలో వచ్చిన కొన్ని కథనాల నేపథ్యంలో ఆయనపై  తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయి. సస్పెన్షన్ కు కూడా గురయ్యారు.  ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరుణంలో ఐటీ మంత్రి నారా లోకేష్ ఓఎస్డీగా రాణిస్తూ, విద్యారంగంలోనూ గోల్డ్ మెడల్స్ సాధించి తన సత్తా చాటారు.