ఫేస్బుక్లో పోస్టు- మంత్రిపదవి ఊష్టు
Published on: Thu Feb 18, 2016 10:53AM
.jpg)
అసలే కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీగారు సోలార్ కుంభకోణంలో పీకల్లోతు మునిగిపోయి ఉన్నారు. అలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఉన్న మంత్రివర్గానికి ఇప్పుడు మరో దెబ్బ ఖాయంగా ఉంది. ఆ రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పడు పెను దుమారాన్నే రేపుతున్నాయి. సాధారణంగా మనకి ఎవరిమీదన్నా ఒళ్లు మండితే వారి మీద ఫేస్బుక్లో వ్యాఖ్యలు చేయడం సహజం. జోసెఫ్కి అలగ్జాండర్ అనే న్యాయమూర్తి మీద ఏదో సందర్భంలో కోపం వచ్చింది. దాంతో అవతలి మనిషి ఎవరు ఏమిటి అని కూడా మర్చిపోయి ఫేస్బుక్లో ఆయనని ‘ఊళలు వేసే నక్క’ అంటూ ఏకిపారేశాడు. ‘నక్క ఎంత రంగుని పులుముకున్నా, దాని నిజస్వరూపాన్ని మార్చుకోలేదు. మిగతా నక్కలు ఊళలు వేసినప్పుడు, అది కూడా ఊళ వేసి తీరుతుంది’ అంటూ పంచతంత్ర కథను కూడా ఉట్టంకించారు. దీంతో ఆయన మీద కోర్టు ధిక్కారం కేసుని మోపారు న్యాయమూర్తులు. ‘అబ్బే! నేనేదో ఉత్తుత్తినే అన్నాను కానీ, నాకు న్యాయవ్యవస్థ అంటే చాలా గౌరవం!’ అని మంత్రిగారు ఎన్ని సంజాయిషీలు ఇచ్చుకున్నా ఉపయోగం లేకపోయింది. ‘ఆ ఇచ్చే సంజాయిషీలు ఏవో మా కోర్టు బోనులో నిల్చొని ఇవ్వండి. ఆ తరువాత మీ మీద మోపిన కేసుని ఉంచాలో కొట్టేయాలో ఆలోచిస్తాం!’ అని కబురు పంపారు న్యాయమూర్తులు. సాక్షాత్తూ న్యాయవ్యవవస్థ మీదే అపవాదు వేసిన జోసెఫ్ని తక్షణమే మంత్రిపదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి.


