రెవెన్యూ శాఖలో భారీ అవినీతి.. కొత్త మంత్రి సంచలన కామెంట్స్.. జగన్కు షాక్
Published on: Sat Apr 16, 2022 12:00PM
ఏపీలో అవినీతి. జగన్రెడ్డి అవినీతి. వైసీపీ నేతల అవినీతి. మద్యంలో అవినీతి. ఇసుకలో అవినీతి. గనుల్లో అవినీతి. ఆంధ్రప్రదేశ్లో ఎందెందు వెతికినా అందందు అవినీతి అవినీతి అవినీతి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక, ప్రభుత్వ విభాగాల్లో కరెప్షన్కు కేరాఫ్ అయిన రెవెన్యూ శాఖ అవినీతి గురించి అయితే ఇక్క చప్పనవసరమే లేదు. భూములు, దస్తావేజుల గోల్మాల్తో కోట్లకు కోట్లు చేతులు మారుతుంటాయనే ఆరోపణ ఉంది. ఈ మాట వాళ్లూవీళ్లు అనడం కాదు.. తాజాగా, రెవెన్యూ శాఖకు కొత్తగా మంత్రిగా వచ్చిన ధర్మాన ప్రసాదరావే తన శాఖలో అవినీతిపై సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే....
రెవెన్యూ శాఖలో అవినీతి భారీ స్థాయిలో పెరిగిపోయిందని, దాని నివారణకు కృషి చేస్తానని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. "అవినీతి నివారణలో భాగంగా సీఎం బ్యాంకుల నుంచి రైతుల ఖాతాలకు నేరుగా నగదు పంపే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. అయినా అవినీతి తగ్గిపోలేదు. ఇది మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉంది. నిజాయితీగా పనిచేస్తేనే ప్రజలు నమ్ముతారు. కులం, మతం చూసి ప్రజలు ఓట్లు వేసే రోజులు పోయాయి. పంజాబ్లో ఆప్కు పట్టం కట్టడమే ఇందుకు నిదర్శనం. వయోభారం పెరిగే కొద్దీ రాజకీయాల్లో ఉత్సాహం తగ్గుతోంది. త్వరలో విరామం ప్రకటించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అప్పుడప్పుడు అనిపిస్తోంది. ప్రజల ప్రేమాభిమానులు ఇందుకు అడ్డొస్తున్నాయి" అని ధర్మాన ధర్మసూక్తులు చెప్పారు. ఆయన మాటలను బట్టి.. రెవెన్యూ శాఖలో భారీ అవినీతి ఉన్నట్టేగా? పాలకులు, అధికారులు దొరికినకాడికి దోచుకుంటున్నట్టేగా? సాక్షాత్తూ మంత్రే చెబుతుంటే ఇక వేరే చెప్పేదేముంది.


