TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బొత్స కన్నెర్ర చేస్తే అమరావతి రైతుల యాత్ర ఆగిపోతుందా?

Published on: Mon Sep 26, 2022 6:50AM

గిల్లి జోల పాట పాట పాడుతున్నట్లు ఉంది మంత్రి బొత్స తీరు. విశాఖలో ఆదివారం ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన రైతుల మహాపాదయాత్రపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము కన్నెర్ర చేస్తే పాదయాత్ర ఆగిపోతుందని హెచ్చరించారు. అదే నోటితో పాదయాత్రలను అడ్డుకోవడం సరికాదంటూ జోలపాట పాడారు. ఒక వైపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే మరో వైపు యాత్రలను అడ్డుకోవడం సరికాదని బొత్స అంటున్నారు.

అమరావతి రైతుల పాదయాత్రను ఆపాలనుకుంటే తమకు ఐదు నిమిషాలు చాల మంత్రి బొత్స సత్యనారాయణ  అది ప్రజాస్వామ్య పద్ధతి కాదన్న ఉద్దేశంతోనే తామా పని చేయడం లేదని  ‘వికేంద్రీకరణకు మద్దతుగా’ అన్న అంశంపై  జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారు.   అమరావతి రైతులు చేస్తున్నది ఏ యాత్రో తనకు అర్ధం కావడం లేదన్నారు. అది రాజకీయ యాత్రా, పాదయాత్రా.. రియల్‌ ఎస్టేట్‌ యాత్రా అన్నది తెలియడం లేదనీ.. ఎందుకంటే అమరావతినే రాజధాని చేయాలన్న ఒప్పందం ఏమీ లేదని బొత్స సూత్రీకరించారు. అయినా అసలు విశాఖను పరిపాలనా రాజధాని చేస్తే ఎవరికైనా వచ్చే నష్టమేమిటని ప్రశ్నించారు. దోచుకోవడమే తమ విధానమైతే ఇప్పటికి సగం విశాఖ తన ఖాతాలోనే ఉండేదని బొత్స అన్నారు.

ప్రజాస్వామ్య పద్ధతితో తాము రైతుల పాదయాత్రను అడ్డుకోవడం లేదని.. రైతులు కూడా అలాగే రెచ్చగొట్టే ధోరణి విడనాడి శాంతియుతంగా ముందుకు సాగాలని హితవు పలికారు. అదే సమయంలో మూడు రాజధానులకు, వికేంద్రీకరణకు అనుగుణంగా పోరాటానికి సిద్ధం కావాలని వైసీపీ నేతలకు పిలుపునిచ్చారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు   వీధి ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు, అవసరమైతే యాత్రలు నిర్వహించాలని బొత్స అన్నారు. అయితే బొత్స వ్యాఖ్యలపై విపక్షాలు మండి పడుతున్నాయి.

అమరావతి రైతుల యాత్రకు పోటీగా విశాఖలో ర్యాలీల నిర్వహణ ద్వారా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా చేసి రైతుల యాత్రను అడ్డుకోవాలన్నదే బొత్స పిలుపు వెనుక ఉన్న కుట్ర అని ఆరోపిస్తున్నారు. మంత్రిగా ఉండి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి అమరావతి యాత్రను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు. బొత్స తీరు నోటితోనూ, నొసటితోనూ వెక్కిరింపే అన్నట్లుగా ఉందని అభివర్ణిస్తున్నారు.