అమరావతితో పాటు ప్రాజెక్టుల్లో అవినీతిని వెలికితీస్తాం: మంత్రి బొత్స

 

ఏపీ రాజధాని అమరావతిపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అమరావతిలో ఏపీ మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. రాజధానిపై ఎలాంటి అపోహలు వద్దని తెలిపారు. అమరావతితో పాటు ఇతర ప్రాజెక్టుల్లో అవినీతిని వెలికితీస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత పసికందు లాంటి నవ్యాంధ్రను చంద్రబాబు నాశనం చేశారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చెప్పింది చేస్తాం.. చేసేదే చెబుతాం.. ఇదే జగన్ ప్రభుత్వ నినాదం’ అని వ్యాఖ్యానించారు.

గన్నవరం ఎయిర్ పోర్టులో చంద్రబాబుని తనిఖీ చేసిన వ్యవహారంపై కూడా బొత్స స్పందించారు. చంద్రబాబును గన్నవరం ఎయిర్ పోర్టులో సాధారణంగానే తనిఖీ చేశారనీ, అది అధికార విధుల్లో భాగమని బొత్స స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో చాలామంది ప్రతిపక్ష నేతలను తనిఖీ చేస్తున్నారని బొత్స గుర్తుచేశారు.