ప్రభుత్వ సొమ్ము నొక్కేసిన బాబు... ఎపి మంత్రి తీవ్ర వ్యాఖ్యలు
posted on Aug 23, 2019 5:49PM
కృష్ణా నది వరదల పై టీడీపీ, వైసిపిల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ వరదలపై స్పందించిన చంద్రబాబు ఇవి ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ వరదలని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేవలం తన ఇంటిని ముంచే ప్రయత్నం లో ప్రభుత్వం సామాన్యులకు తీరని నష్టాన్ని కలగచేసిందని ఈ రోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో అయన వివరించారు. ఐతే తాజాగా దీని పై జలవనరుల మంత్రి అనిల్ స్పందించారు. చంద్రబాబు వరదల పై మాట్లాడతారనుకుంటే రిజర్వాయిర్ లో కట్టుకున్న తన ఇల్లు మునిగింది గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. వరదలనేవి ప్రకృతి విపత్తు కాదు మానవ విపత్తు అని ప్రూవ్ చేసేందుకు హైటెక్ తరహాలో ప్రజంటేషన్ ఇచ్చారని అన్నారు. బాబు గారి ఐదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్ట్ కూడా నిండకపోవడంతో బాబును కరువు నాయకుడని ప్రజలు తేల్చేశారని వ్యాఖ్యానించారు. అలాగే శ్రీశైలం నీటిని రాయలసీమకు అందించడం చంద్రబాబుకు ఇష్టం లేక ఆరోపణలు చేస్తున్నారని అయన విమర్శించారు. బాబు ఆశీసులతోనే మాజీ స్పీకర్ కోడెల అసెంబ్లీ ఫర్నిచర్ దొంగతనం చేశారన్నారు. చంద్రబాబు కూడా కోడెల తరహాలోనే ప్రభుత్వ సొమ్ము చాల చోట్ల దాచిపెట్టారని విమర్శించారు. ఈ దొంగల వ్యవహారం బయట పడకూడదనే బాబు ఈ హైటెక్ ప్రెస్ మీట్ నాటకం ఆడారని తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికైనా ప్రజల తనకు ఎందుకు ఓటు వేయలేదో బాబుగారు సమీక్షించుకుంటే మంచిదని అయన సలహా ఇచ్చారు.