ఎంఐఎం నేత షూలో సెల్ ఫోన్.. కౌంటింగ్ కేంద్రంలో కలకలం
posted on Dec 4, 2020 3:41PM
జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రంలోకి అధికారులు సెల్ఫోన్ లను నిషేధించారు. అయితే ఎంఐఎం పార్టీకి చెందిన నేత కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్తో రావడం తీవ్ర కలకలం రేపింది. యూసఫ్ గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలోని కౌంటింగ్ కేంద్రానికి ఎంఐఎం పార్టీ అభ్యర్థి షాహినా బేగం భర్త షరీఫుద్దీన్.. అనుమతి లేకుండా సెల్ఫోన్తో ప్రవేశించారు. ఆ సెల్ఫోన్ ను ఎవరూ గుర్తించకుండా షూస్లో పెట్టుకుని మరీ కౌంటింగ్ కేంద్రానికి వచ్చారు. ఇది గమనించిన కొందరు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే షరీఫుద్దీన్ ను కౌంటింగ్ హాల్ నుంచి బయటకు లాక్కొచ్చారు. అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి ఆయన్ను తరలించారు.
ఇక, ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. ఇప్పటివరకు టీఆర్ఎస్ 15 డివిజన్లలో నెగ్గి, 51 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. ఎంఐఎం 21 డివిజన్లలో విజయం సాధించి, మరో 19 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 5 డివిజన్లలో నెగ్గి, 36 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 2 డివిజన్లలో నెగ్గి, ఒక డివిజన్ లో ఆధిక్యంలో ఉంది.