మెగా డీఎస్సీ వర్సెస్ సచివాలయం ఉద్యోగాలు: జగన్ సంచలన కామెంట్స్!
Published on: Fri Jun 12, 2026 10:27AM

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. గురువారం (జూన్ 11) వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జగన్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, అసలైన రికార్డు అంటే ఏంటో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి జగన్ వివరించే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, దేశంలోనే అతిపెద్ద ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తమ హయాంలోనే జరిగిందని చెప్పుకున్నారు. వైసీపీ హయాంలో ఒకే ఒక్క నోటిఫికేషన్ ద్వారా ఏకంగా 1.3 లక్షల ఉద్యోగాల భర్తీ చేశామనీ.. అదే అసలైన రికార్డు అని జగన్ చెప్పుకొచ్చారు.
ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో జగన్ చేసిన.. ఈ పోలిక అందరినీ విస్మయపరిచింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన మెగా డీఎస్సీ ఉద్యోగాలను, తన హయాంలో హయాంలో తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాలతో పోల్చడమే ఈ విస్మయానికి కారణం. డీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉపాధ్యాయ ఉద్యోగాల స్కేల్, వాటికున్న అర్హతలు, సామాజిక ప్రాధాన్యత పూర్తిగా వేరనే సంగతి తెలుసుకోవాలంటూ నెటిజనులు జగన్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. సచివాలయం ఉద్యోగాలను మెగా డీఎస్సీతో పోల్చడం పట్ల సామాన్య ప్రజలు, నిరుద్యోగుల సైతం తప్పుపడుతున్నారు.


