TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సచివాలయంలోకి మీడియా ప్రవేశంపై ఆంక్షలు !

Published on: Sat Feb 21, 2015 7:08AM

 

ఒకప్పుడు తెలంగాణా ఉద్యమాలలో ఆ తరువాత మళ్ళీ ఎన్నికల సమయంలో మీడియాను విరివిగా ఉపయోగించుకొన్న తెరాస అధ్యక్షుడు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత అదే మీడియాతో ఘర్షణ వైఖరి అవలంభిస్తున్నారు. మీడియా వాళ్ళెవరూ సచివాలయంలోకి ప్రవేశించడానికి వీలులేదని ఆంక్షలు విధించారు. సచివాలయంలో మీడియా వ్యక్తులు తిరుగుతుండటం వలన అధికారుల పనికి ఆటంకం కలుగుతున్నందునే మీడియాను అనుమతించడం లేదని చెప్పారు. అందుకు మీడియా ఆయనను చాలా తీవ్రంగా ఆక్షేపించింది. దానితో ఆయన కొంచెం వెనక్కి తగ్గి సచివాలయంలో మీడియా ప్రవేశాన్ని నిషేధించలేదని, కొంత నియంత్రణ అవసరమనే ఉద్దేశ్యంతో వారి రాకపోకలకు ఎటువంటి పద్ధతి ఏర్పాటు చేయాలనే అంశం గురించి చర్చించామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మీడియా మిత్రులతో కూడా ఈ విషయం గురించి చర్చించిన తరువాతనే ఒక నిర్ణయం తీసుకొంటామని అన్నారు. ఆయన ఇదేపని ముందే చేసి ఉండి ఉంటే మీడియా నుండి ఈవిధంగా నిరసనలు ఎదుర్కోవలసి వచ్చేదే కాదు. కానీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని, మళ్ళీ ఇప్పుడు ‘తూచ్! మీడియాపై నిషేధం విధించలేదు’ అని సర్ది చెప్పుకోవలసి రావడం ఆయనకి ఎంతమాత్రం గౌరవం కాదు.

 

అలాగే మీడియా కూడా కొంత స్వీయ నియంత్రణ పాటించడం చాలా అవసరం. మంత్రులు అధికారుల నుండి సమాచార సేకరణ లేదా ఇంటర్వ్యూల కోసం యధేచ్చగా సచివాలయంలో తిరుగుతుంటే ఉద్యోగులు, అధికారుల పనికి ఆటంకం కలుగుతుంది. కనుక మీడియా కూడా ప్రభుత్వంతో సహకరించితే వారికీ గౌరవంగా ఉంటుంది.

 

ప్రతీ రాజకీయ పార్టీ మీడియాతో మాట్లాడేందుకు ప్రత్యేకంగా అధికార ప్రతినిధులను ఏర్పాటు చేసుకొంటునట్లే, ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు మీడియాకు అవసరమయిన సమాచారం ఇచ్చేందుకు ఒక అధికార ప్రతినిధిని నియమించుకోవచ్చును. మీడియా వాళ్ళు సమాచార సేకరణ కోసం మంత్రుల, అధికారుల కార్యాలయాల గేట్ల దగ్గర ఎండనకా, వాననకా పడిగాపులు కాస్తుండటం అందరికీ చాలా సహజంగా కనిపిస్తుండవచ్చును. కానీ మంత్రులు అధికారులు చెప్పే మాటలను ప్రజలకు చేర్చే గురుతరమయిన బాధ్యతను నిర్వహిస్తున్న మీడియాకు అటువంటి పరిస్థితి కల్పించడం చాలా అవమానకరం. కనుక సచివాలయంలో, అసెంబ్లీలో, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ వంటి ముఖ్యమయిన చోట్ల ప్రభుత్వమే మీడియా కోసం అన్ని సౌకర్యాలతో కూడిన సమావేశ మందిరాలు ఏర్పాటు చేసి అక్కడే వారికి అవసరమయిన సమాచారం అందించే విధంగా ఏర్పాట్లు చేసినట్లయితే ఇటువంటి ఘర్షణ వాతావరణం, సమస్యలని నివారించవచ్చును. ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య వారధిగా నిలిచే మీడియాకు అవసరమయిన సమాచారం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది.