కేసీఆర్‌ని నిద్రపోనివ్వ... జగ్గారెడ్డి...

 

మెదక్ పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా జగ్గారెడ్డి పోటీ చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. బీజేపీ అభ్యర్థిగా జగ్గారెడ్డి ఎంట్రీతో మెదక్ ఉప ఎన్నిక రాజకీయం రసకందాయంలో పడింది. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి కేసీఆర్ మీద కామెంట్లు చేశారు. మెదక్ ఎంపీగా తనను గెలిపిస్తే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను నిద్రపోనివ్వనని, ఆయున ఫామ్‌హౌస్‌లో పడుకున్నా ప్రజా సమస్యలపై పోరాడి నిద్దురలేపుతానని జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన బీజేపీ, టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జగ్గారెడ్డి పై విధంగా కామెంట్ చేశారు. ‘‘దొంగమాటలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట. హైదరాబాద్‌ని సింగపూర్ చేస్తానని చెబుతున్న ఆయన భవిష్యత్తులో సింగపూర్ నుంచే తెలంగాణకు నీళ్ళు తీసుకొస్తానని చెప్పినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’’ అన్నారు. మొత్తానికి ఘాటు కామెంట్లు చేసే జగ్గారెడ్డి ముందు ముందు కేసీఆర్ మీద ఇంకెంత ఘాటైన కామెంట్లు చేస్తారోనన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో ఏర్పడింది.