TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మావి‘గన్’ పేలదు.. డీవీ శ్రీనివాస్ విశ్లేషణ

Published on: Sat Apr 4, 2026 2:34PM

తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం అమరావతి రాజధాని అంశం  కేంద్ర బిందువుగా మారింది. పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం పొందుతున్న తరుణంలో, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తెరపైకి తెచ్చిన  మావిగన్  కాన్సెప్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. సీనియర్ జర్నలిస్ట్ డి.వి. శ్రీనివాస్ విశ్లేషణ ప్రకారం, జగన్ వ్యూహం వెనుక కేవలం రాజకీయ ఉనికిని చాటుకునే ప్రయత్నం మాత్రమే కనిపిస్తోంది. 

అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో..  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్..  ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. అయితే.. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రైతుల సమస్యలను విస్మరించిన జగన్.. ఇప్పుడు అకస్మాత్తుగా శేషగిరమ్మ వంటి వృద్ధులను కలవడం విమర్శలకు తావిస్తోంది. 

జగన్ అకస్మాత్తుగా రైతుల పక్షపాతిగా మారడం వెనుక ఒక వ్యూహం ఉందని సీనియర్ జర్నలిస్ట్ డీవీశ్రీనివాస్ అంటున్నారు.  అమరావతి ప్రాంతంలో కోల్పోయిన ఓటు బ్యాంకును, కనీసం ఈ మావిగన్  ప్రాంతంలోని పట్టణ ఓటర్లను ఆకర్షించడం ద్వారా దక్కించుకోవాలని ఆయన భావిస్తున్నారు. అయితే..  గతంలో అమరావతి రైతులపై జరిగిన దాడులు, మహిళా రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ప్రజలు అంత సులభంగా మర్చిపోలేరని, మరచిపోరనీ డీవీ శ్రీనివాస్ చెబుతున్నారు.  అమరావతి నిర్మాణానికి వేల కోట్లు ఖర్చవుతాయని, అది సాధ్యం కాదని ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో అయోమయం సృష్టించడమే వైసీపీ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోందంటున్నారాయన.

అమెరికాలో ఒక పోలీసు అధికారి బూటు కాలితో తొక్కడం ఎలాగైతే ఒక ప్రభుత్వం పతనానికి దారితీసిందో, ఏపీలో కూడా రైతు కుటుంబాల పట్ల జరిగిన దుశ్చర్యలే గత ఎన్నికలలో జగన్ ఓటమికి ప్రధాన కారణమని గుర్తు చేసిన డీవీ శ్రీనివాస్.. ఇప్పుడు  మావిగన్ పేరుతో ముందుకు రావడం అనేది కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమే తప్ప, వాస్తవిక అభివృద్ధికి సంబంధించినది కాదని ఆయన చెప్పారు.  

రాబోయే రోజుల్లో అమరావతి నిర్మాణం వేగవంతమైతే, జగన్ ప్రతిపాదించిన  మావిగన్ మంత్రం ఫలించే అవకాశమే లేదన్నారాయన. ప్రభుత్వం మానవీయ కోణంలో రైతుల సమస్యలను పరిష్కరిస్తే..  జగన్ ఆరోపణలకు బలం ఉండదు. ఒకవేళ వైసీపీ తన మొండి వైఖరిని వీడకుండా, కేవలం విమర్శలకే పరిమితమైతే, ఉత్తరాంధ్ర మరియు రాయలసీమలో కూడా ఆ పార్టీకి ఉన్న అంతంత మాత్రం పట్టు కూడా సడిలిపోతుందని అన్నారు డీవీ శ్రీనివాస్.  రాబోయే ఎన్నికల నాటికి అమరావతి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశంగా మారుతుందని చెప్పారు.