TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆదిలాబాద్ లో భారీ విమానాశ్రయం.. జూన్ 2లోగా శంకుస్థాపన

Published on: Thu Apr 9, 2026 12:30PM

ఉత్తర తెలంగాణ పారిశ్రామిక, ఆర్థిక ప్రగతిని పరుగులు తీయించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్లో ఒక భారీ  ఎయిర్‌పోర్ట్ నిర్మించనున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే ఆదిలాబాద్ రూపురేకలు మారిపోవడమే కాకుండా, విమానయాన రంగంలో తెలంగాణ   ముద్రను మరింత బలంగా ఉంటుందన్నారు.  ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయిన రామ్మోహన్ నాయుడు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనలపై  చర్చించారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పాత ఎయిర్‌స్ట్రిప్‌ను పూర్తిస్థాయి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ ఎయిర్ పోర్ట్  డొమెస్టిక్ అవసరాలతో పాటు,  దేశ రక్షణ అవసరాలకు కూడా ఉపయోగపడేలా నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

 ఈ  ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియ మొదలైందన్నారు. రక్షణ శాఖ అధీనంలో ఉన్న 300 ఎకరాలకు అదనంగా, రాష్ట్ర ప్రభుత్వం మరో 450 ఎకరాల భూమిని సేకరించి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సానుకూలంగా స్పందించిందని చెప్పారు.  కాగా ఈ విమానాశ్రయ నిర్మాణం కోసం ఈ నెల 17న పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులు ఆదిలాబాద్‌లోని అంతర్గాం ప్రాంతంలో క్షేత్రస్థాయి పరిశీలన జరపనున్నారు.

 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీ లోపు ఈ మెగా ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ విమానాశ్రయానికి  అనుబంధంగా ఒక భారీ పారిశ్రామిక కారిడార్‌ను కూడా ఏర్పాటు చేయడం ద్వారా  స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలుంటాయని పేర్కొన్నారు. 

ఇక పోతే.. వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్ట్ పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు.  అలాగే పెద్దపల్లి జిల్లా అంతర్గాం, కొత్తగూడెం ప్రాంతాల్లో కూడా విమానాశ్రయాల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడంతో పాటు, జిల్లాల వారీగా ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన ఉద్దేశమని చెప్పారు.