వామ్మో...కుక్క కరుస్తుందని ఇంట్లో దూరితే....టార్చర్ చేసి చంపేశారు !

 

మద్యపానం ఆరోగ్యానికే కాదు ప్రాణానికి కూడా హానికరమే అని తెలియచేసే ఒక ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. కుక్క కరుస్తుందనే భయంతో ఫూటుగా మందు కొట్టిన ఓ మందుబాబు ఒక ఇంట్లోకి చొరబడితే అంతు దొంగ ఏమో అనే అనుమానంతో అతన్ని స్తంబానికి కట్టేసి చిత్ర హింసలు చేసి చంపిన ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకీ పట్టణంలో వెలుగుచూసింది. 

బారాబంకీకి చెందిన ఓ యువకుడు పీకలదాకా మద్యం తాగి అర్ధరాత్రి సమయంలో అత్తగారింటికి వెళుతుండగా, అతన్ని చూసిన ఓ వీధికుక్క వెంట పడింది, కుక్క కరుస్తుందనే భయంతో పరుగు లంకించుకున్నా ఆ మందుబాబు ఎంత పరిగెత్తినా ఆ కుక్క వస్తుండడంతో దాని బారి నుంచి బయటపడేందుకు ఓ ఇంట్లోకి దూరాడు. ఆ మందుబాబు తమ ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగని భావించిన ఇంటి కుటుంబసభ్యులు అతన్ని స్తంబానికి కట్టేశారు. 

అయితే  అప్పటికే అతను పూటుగా మద్యం తాగి ఉండటంతో, అతను విషయాన్ని విడమరచి చెప్పలేకపోయాడు. తమ ఇంట్లో దొంగతనానికి వచ్చాడని భావించిన ఇంట్లోని వారంతా ఏకమై, అతన్ని బంధించి, ఇనుపచువ్వలతో కాల్చి చిత్ర హింసలు పెడుతూ కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు.