TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సిగరెట్ కాల్చి పొగ మీదకు వదిలాడంటూ కొట్టి చంపేశారు!

Published on: Wed Apr 2, 2025 10:42AM

స్వల్ప విషయానికి ఘర్షణ పడి ఒక యువకుడిని తొమ్మిది మంది కలిసి కొట్టి చంపేసిన దారుణ ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెడితే.. ఓ యువకుడు సిగరెట్ కాలుస్తున్నాడు. అతడు పీల్చి వదిలిన పొగ తనపైకి వచ్చిందంటూ మరో యువకుడు అతడితో వాదనకు దిగాడు. ఆ వాదన కాస్తా చినికిచినికి గాలివానగా మారి ఘర్షణకు దారి తీసింది. దీంతో సిగరెట్ తాగిన యువకుడిని తొమ్మిది మంది కలిసి దారుణంగ కొట్టి చంపేశారు. వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్లలో ఈ దారుణం జరిగింది.

పర్వతగిరి సీఐ రాజగోపాల్  కథనం ప్రకారం సంగెం మండలం కుంటపల్లికి చెందిన చిర్ర ధని, అతడి సోదరుడు చిర్ర బన్నీ (21), తల్లి పూల, సోదరి పూజిత, స్నేహితుడు గిరిబాబుతో కలిసి ఆదివారం రాత్రి గవిచర్లలో జరిగిన గుండ బ్రహ్మయ్య జాతరకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత అందరూ ఇంటికి వెళ్లిపోగా.. బన్నీ మాత్రం తన స్నేహితులతో కలిసి అక్కడే ఉన్నాడు. ఈ సమయంలో బన్నీ ఓ పాన్ షాప్ వద్ద సిగరెట్ తాగుతున్నాడు.

 అతడు వదిలిన సిగరెట్ పొగ పక్కనే ఉన్న గవిచర్లకు చెందిన వేల్పుల సిద్ధు వైపుకు వెళ్లింది. దీంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి గొడవకు దారి తీసింది. అక్కడే ఉన్న సిద్దు అన్న వినయ్ వారికి నచ్చజెప్పి సిద్దుతో సారీ చెప్పించి అక్కడి నుంచి పంపించేశాడు. అయితే దీన్నే మనసులో పెట్టుకున్న సిద్దు.. తన మేనమాము గుండేటి సునీల్, ఫ్రెండ్స్ గుండేటి రాజు, కార్తీక్, మహేందర్, మెట్టుపల్లి భరత్, చిన్న భరత్, రాజ్కుమార్, కొమ్మాలుతో కలిసి వచ్చి బన్నీపై దాడికి దిగాడు. ఇదంతా గమనించిన స్థానికులు బన్నీని కాపాడేందుకు చాలానే ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తీవ్రంగా గాయపడ్డ బన్నీ అక్కడే కుప్పకూలిపోయాడు. సిద్దు తన ఫ్రెండ్స్ తో అక్కడినుంచి పరారయ్యాడు. స్థానికులు బన్నీని 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి అన్న ధని ఫిర్యాదు మేరకు తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.