ఎస్.ఆర్.నగర్ రోడ్లపై ఉమ్మేస్తూ పాతబస్తీ యువకుడు హల్‌చల్!

మనకి చెడు జరిగింది కాబట్టి ఇతరులకు కూడా చెడు తలపెట్టాలనుకునే మనస్తత్వం కొందరికి ఉంటుంది. ఈ కరోనా కష్టకాలంలో అలాంటివారు చాలామంది వెలుగులోకి వచ్చారు. కరోనా లక్షణాలు ఉన్నవారు.. కావాలనే మాస్క్ తీసేసి పబ్లిక్ ప్లేసుల్లో దగ్గడం, నోటిలోని తేమని తీసి లిఫ్ట్ ల్లో, మెట్రోల్లో పూయడం.. ఇలా పలు సంఘటనలు కెమెరా కంటికి చిక్కాయి. అయితే తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని ఎస్.ఆర్.నగర్ లో చోటుచేసుకుంది.

ఒక యువకుడు బైక్ పై వచ్చి ఎస్.ఆర్. నగర్ కమ్యూనిటీ హాల్ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల ఉమ్మేస్తూ తిరుగుతుండంటంతో.. అక్కడి స్థానికులు అతనిని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ యువకుడు పాతబస్తీకి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. అతను ఎవరు? ఎందుకు ఇలా చేసాడు? కరోనా లక్షణాలు ఉన్నాయా? తనకి కరోనా ఉందేమోనన్న అనుమానంతో ఇతరులకు కూడా సోకాలనే ఉద్దేశంతో ఇలా చేశాడా? అనేది తెలియాల్సి ఉంది.

మరోవైపు యువకుడి తీరుతో స్థానికుల్లో ఆందోళన నెలకొనడంతో.. జిహెచ్ఎంసి అధికారులు రంగంలోకి దిగి.. ఆ యువకుడు తిరిగిన రోడ్లను శానిటైజ్ చేసారు.

ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఇలా ప్రవర్తిస్తూ అనుమానంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దని, ఒకవేళ బయటకు రావాల్సిన పరిస్థితి వస్తే.. తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు ధరించాలని కోరుతున్నారు.