ఏపీకి హోదా కోసం తెలంగాణ బిడ్డ నిరసన

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో వరంగల్‌కు చెందిన ఉమేష్ రెడ్డి కన్నాట్ ప్లేస్‌లోని సెల్ టవర్ ఎక్కాడు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ నినాదాలు చేశాడు. ఊహించని పరిణామంతో అప్రమత్తమైన స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అతనికి కిందికి దించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తాను నిరసన ఎందుకు చేపట్టింది పోలీసులకు వివరించాడు.

 

ఆంధ్రప్రదేశ్‌లో ఐదు కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతుందని, అందుకే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని ఉమేష్ రెడ్డి అన్నాడు. గత కొంతకాలంగా ఏపీకి హోదా కోసం జరుగుతున్న పరిణామాలను చూస్తున్నానని, ఏపీకి అన్యాయం జరిగిందనే భావనతో సెల్ టవర్ ఎక్కి నిరసన చేపట్టినట్లు చెప్పాడు. సమాచారం తెలుసుకున్న ప్రధాని కార్యాలయ అధికారులు తనతో మాట్లాడారని పోలీసులకు చెప్పాడు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్నదే తన ప్రధాన డిమాండ్ అని ఉమేష్ రెడ్డి స్పష్టం చేశాడు. తనకు కాంగ్రెస్ అంటే చాలా అభిమానమని, కాంగ్రెస్ పార్టీయే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని, ఏపీకి ప్రత్యేక హోదా కూడా ఇస్తామని చెబుతోందని, కానీ ప్రస్తుతమున్న ప్రభుత్వం హోదా ఇవ్వకుండా నాన్చుతోందని, అందుకే ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసమే ఈ విధంగా సెల్ టవర్ ఎక్కానని పోలీసులకు వివరించాడు.