TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కుక్క మెరిగిందన్న కోపంతో ఏం చేశాడంటే..?

Published on: Mon Jul 4, 2022 12:34PM

అత్తమీద కోపం దుత్త మీద చూపించాడన్నది సామెత. కానీ ఢిల్లీకి చెందిన ధరమ్ వీర్ దహియా కుక్క మీద కోపం ఆ కుక్క యజమానుల మీద చూపించాడు. అలాగని కుక్కనూ వదిలేయలేదు. దానిమీదా దాడి చేసి తన కోపం తీర్చుకున్నాడు. మనిషిలోని పశుత్వానికి పరాకాష్టగా నిలిచే ఈ సంఘటనకు ఢిల్లీ వేదిక అయ్యింది.

ఢిల్లీలోని పశ్చిమ విహార్ లో నివసించే ధరమ్ వీర్ దహియా ఉదయాన్నే వాకింగ్ కు వెళుతుంటే.. పొరుగింటి వారి కుక్క అతడిని చూసి మొరిగింది. కుక్క నన్ను చూసి మెరగడమేమిటి? నేనేమైనా దొంగ అనుకుంటోందా? అని కోపం వచ్చింది. కోపగించుకుని ఊరుకోకుండా ఆ కుక్క తోక పట్టుకుని ఈడ్చేసే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ కుక్క అతడిని కరిచింది. దీంతో కోపంతో ఊగిపోయిన ధరమ్ వీర్ దహియా రాడ్ తీసుకుని దానిపై దాడి చేయబోయాడు.

వద్దంటూ అడ్డు వచ్చిన ఆ కుక్క యజమానిపై రాడ్ తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అక్కడితో ఊరుకోకుండా అడ్డొచ్చిన మరో వ్యక్తినీ, ఆ ఇంట్లోని మహిళనూ కూడా తీవ్రంగా గాయపరిచాడు. ఇప్పుడు పోలీసు స్టేషన్లో ఊచలు లెక్క పెడుతున్నాడు.

ఎందుకంటే అతడు చేసిన దాడి మొత్తం అక్కడి సీసీ కెమేరాలో రికార్డైంది. కుక్క యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అంతే కాకుండా మూగజీవాలపై క్రూరత్వ నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.