TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న వ్యక్తి అరెస్ట్

Published on: Tue Apr 14, 2026 9:02PM

 

హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠాపై చాదర్‌ఘాట్ పోలీసులు కొరడా ఝళిపించారు. పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఒక నిందితుడిని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుండి భారీగా నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.మలక్‌పేటలోని కోటక్ మహేంద్ర బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ సత్యనారాయణ రేపాలా ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 7న బ్యాంక్‌లోని క్యాష్ రీసైక్లర్ మెషీన్‌లో జమ చేసిన నోట్లను పరీక్షించగా 500 ముఖ విలువ కలిగిన 10 నకిలీ నోట్లను గుర్తించారు. 

UV లైట్ పరీక్షలు, నోట్ల స్కానింగ్ యంత్రాలు కూడా అదే విషయాన్ని నిర్ధారించడంతో వెంటనే బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బ్యాంక్ ట్రాన్సాక్షన్లను పరిశీలించగా, ఈ నకిలీ నోట్లను మార్చి 27న చంద్రాయణగుట్ట హఫీజ్ బాబా నగర్‌కు చెందిన అహ్మద్ పాషా(33) అనే వ్యక్తి ఖాతాలో జమ చేసినట్లు గుర్తించారు. పోలీసులు వెంటనే అహ్మద్ పాషా ను అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వృత్తిరీత్యా కసాయిగా పని చేసే అహ్మద్ పాషా, సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి నుంచి నకిలీ కరెన్సీ తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. అసలు డబ్బుగా చలామణి చేయాలనే ఉద్దేశంతో షాద్‌నగర్ వద్ద మొత్తం 94,000 విలువైన నకిలీ నోట్లను సేకరించినట్లు వెల్లడించాడు. అందులో రూ. 5,000 బ్యాంకులో జమ చేయగా, మిగిలిన 89,000 విలువైన 178 నకిలీ నోట్లు అతడి ఇంటి వద్దే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపైu/s179,318(4)BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాల ప్రకారం ఈ నకిలీ కరెన్సీ సరఫరా గుజరాత్ నుంచి కార్యకలాపాలు నిర్వహించినట్లుగా తేలింది. ప్రధాన నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. నగరంలో నకిలీ కరెన్సీ చలామణి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.