అధ్యాపకులకు మమతా బంపర్ ఆఫర్..దేశంలో ఎక్కడా లేదు
posted on Jan 8, 2019 9:47AM
లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని మోడీ అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్టు ప్రకటించారు. తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని కళాశాలల్లో, విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అధ్యాపకుల పదవీ విరమణ వయస్సును పెంచుతున్నట్లు ప్రకటించారు. 62 ఏళ్లుగా ఉన్న అధ్యాపక ఉద్యోగ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచారు. అదే విధంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ (వీ.సీ) విరమణ వయస్సును కూడా 70 ఏళ్లకు పెంచారు. ఈ మేరకు సోమవారం కోల్కత్తా వర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో మమత ప్రకటించారు. కార్యక్రమంలో బెనర్జీ మాట్లాడుతూ... ‘‘ 60 ఏళ్లు దాటిన తరువాత ఓ ఉద్యోగి పనిచేయలేడని నేను అనుకోను. వారి అనుభవాలు, సేవలు మన విద్యార్థులకు చాలా అవసరం. అందుకే అధ్యాపకుల పదవీ విరమణ వయస్సును పెంచుతున్నాం. బలహీన వర్గాల ఉన్నత విద్య కోసం రూ.200 కోట్లు విడుదల చేస్తున్నాం. మౌలిక సదుపాయాల కోసం రూ. 28000 కోట్లను ఈ ఏడాదికి ఖర్చు చేయదలచాం’ అని పేర్కొన్నారు.