ఎంపీ హర్షకుమార్ పై ప్రధానికి యానాం ఎమ్మెల్యే మల్లాడి ఫిర్యాదు
Published on: Thu May 10, 2012 11:41AM
ఇటీవల మూతపడిన కేంద్రపాలిత ప్రాంతం యానాంలోని రీజెన్సీ సిరామిక్స్ వ్యవహారం కేంద్ర స్థాయికి చేరింది. ఈ పరిశ్రమ వైస్ చైర్మన్ నాయుడు హత్య, ఆ తరువాత లాకౌట పరిణామాలు ఓ సంచలనమయ్యాయి. ఈ పరిణామాలను ఉపయోగించుకోవాలన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీలోని కీలక నాయకులు యానాంలో రీజెన్సీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి కాంగ్రెస్ తరుపున అమలాపురం ఎంపీ జి.వి .హర్షకుమార్ యానాంలో కార్మికులతో ఒక కొత్త గ్రూపును నెలకొల్పారు. ఈ గ్రూపును ముందేసుకుని ఆయన స్థానిక ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావుపై విమర్శల వర్షం కురిపించారు. ఒకదశలో మల్లాడిని అరెస్టు చేయాలన్నంత సీరియస్ గా ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యానాలు చేశారు.
ఆ తరువాత పరిశ్రమను తెరిపించాలని డిమాండ్ తో హర్షకుమార్ ముందుకు వెళ్ళారు. ఈ దశలో ఎమ్మెల్యే మల్లాడి క్రిష్ణారావు యానాం కార్మికుల విజ్ఞాపనలను తీసుకుని దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిశారు. తమ ప్రాంతానికి పేరు తెచ్చిన రీజెన్సీ పరిశ్రమలు మూడింటినీ తిరిగి తెరిపించాలని డిమాండ్ చేస్తూనే యానాం అభివృద్ధికి నిధులను మంజూరు చేయాలని కృష్ణారావు కోరారు. తమ ప్రాంతంలో ఎంపీ హర్షకుమార్ అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆయన ఈ సందర్భంగా ప్రధాని మన్మోహన్ కు ఫిర్యాదు చేశారు. ప్రధాని జోక్యం చేసుకుంటే హర్షకుమార్ యానాం వైపు కన్నెత్తి చూడరన్న మల్లాడి వ్యూహం ఎంతవరకూ ఫలిస్తుందో తెరపై చూడాల్సిందేనని వారు అంటున్నారు.


