మున్సిపోల్స్ కు సిద్ధమవుతున్న బిజెపి
Published on: Tue Apr 24, 2012 10:27AM
మెహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానాన్ని అనూహ్యంగా దక్కించుకున్న కమలనాథులు ఇప్పుడు తమ దృష్టి అంతా మున్సిపల్ ఎన్నికలపై కేంద్రీకరించారు. మెహబూబ్ నగర్ మున్సిపాలిటీతో పాటు వనపర్తి, నారాయణపేట మున్సిపాలిటీలను దక్కించుకోవటానికి బిజెపి నాయకులు కసరత్తు ప్రారంభించారు. గత నెలలో జరిగిన ఉప ఎన్నికలలో మెహబూబ్ నగర్ లో బిజెపి అభ్యర్థి వై.శ్రీనివాసరెడ్డి ఒక వెయ్యి 800 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
సరిగ్గా మూడేళ్ళ క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు కూడా దాదాపు ఇంతే కావటం గమనార్హం. అంటే వందల్లో ఉన్న ఓటు బ్యాంకు ఏకంగా వేలల్లోకి మారిదన్నమాట. ఈ ఓట్ల జడివానలో తడిసి తబ్బిబ్బయిన బిజెపి నేతలు ఈ వరవడిని కొనసాగించాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలపై ఏ రోజైనా నిర్ణయం వెలువడవచ్చని ప్రచారం జరుగుతుండటంతో కమలనాధులు మరో సమరానికి నడుం బిగించారు. వీరి సమరసన్నాహాలు టి.ఆర్.ఎస్. నేతలను బెంబేలెత్తిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి గనుక మంచి ఫలితాలు సాధిస్తే తెలంగాణలో తమ ఆధిపత్యానికి గండి పడుతుందని వారు భయపడుతున్నారు.


