TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జూన్ లో మందాకృష్ణ మాదిగ పార్టీ!

Published on: Wed Apr 25, 2012 12:56PM

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జూన్ లో రాజకీయపార్టీగా అవతరించబోతోంది. జూన్ ఐదో తేదీ తరువాత పార్టీని అధికారికంగా ప్రారంభిస్తామని ఎం.ఆర్.పి.ఎస్. నాయకుడు మందా కృష్ణ మాదిగ "తెలుగువన్.కామ్''కు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల హక్కుల పరిరక్షణ కోసం నూతన పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్, టిడిపి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలు బడుగు, బలహీనవర్గాల ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

 

 

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కుటుంబసభ్యులకు, తమ సామాజికవర్గానికి లక్షల కోట్లు దోచిపెట్టారన్నారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాకముందు పీకల్లోతు అప్పుల్లో ఉన్నారని, అధికారంలోకి వచ్చిన తరువాత లక్షలాది కోట్లు ఆర్జించారని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ను తెలంగాణా, ఆంధ్రా, రాయలసీమలుగా విడదీసి మూడు ప్రత్యేక రాష్త్రాలు ఏర్పాటు చేయాలని అప్పుడే ఈ మూడు ప్రాంతాలు త్వరితగతిన అభివృద్ధి చెందుతాయని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి రావాడం ఖాయమని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వెనక్కి రప్పిస్తామన్నారు. ఏయే శాఖలు ఈ నిధులు బదిలీ అయ్యాయో వాటినుంచి వడ్డీతో సహా రప్పించి వాటిని ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు.

 

 

అంబేద్కర్ ఆశయాలను కోరుకునే ప్రతి ఒక్కరూ తాము ఏర్పాటు చేయబోయే పార్టీకి మద్దతు ఇవ్వాలన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కంటే మాజీ ముఖ్యమంత్రి రోశయ్య సమర్థుడని ఆయన చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి అధికారాన్ని కాపాడుకోవడం కోసమే పని చేస్తున్నారన్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కేంద్ర మంత్రులతో సంప్రదించారనీ, కానీ ఈ విషయమై ఎన్నిసార్లు కలిసినా సిఎం కిరణ్ కుమార్ రెడ్డి స్పందించటం లేదని ఆయన ఆరోపించారు.