మదనపల్లె అక్కాచెల్లెళ్ల డెత్ మిస్టరీ.. కుక్కపై అలేఖ్య పునర్జన్మ ప్రయోగాలు!!

చిత్తూరు జిల్లా మదనపల్లెలో అక్కాచెల్లెళ్ల హత్య సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మూఢ నమ్మకాల మాయలో పడి కన్న తల్లిదండ్రులే వారి ఇద్దరి కూతుళ్ళని కడతేర్చారన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే, అక్కాచెల్లెళ్ల హత్య వెనుక కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో తమ కూతుళ్లు మరణించలేదని, మళ్ళీ తిరిగి వస్తారని తల్లి పద్మజ విచిత్ర వాదన చేయగా.. తండ్రి పురుషోత్తమ నాయుడు మాత్రం హత్యలకు దారితీసిన కారణాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. పెద్ద కూతురు అలేఖ్య చెప్పిన మాటలు నమ్మి, పునర్జన్మలను విశ్వసించి ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం.

 

మదనపల్లెలో అక్కాచెల్లెళ్ల హత్యకు ప్రధాన కారణం పెద్ద కుమార్తె అలేఖ్యనే అని తెలుస్తోంది. అలేఖ్యకు పునర్జన్మలపై నమ్మకం ఉంది. పునర్జన్మల గురించి వివిధ పుస్తకాలు, వివిధ వీడియోలు చూసి చాలా విషయాలు తెలుసుకుంది. పునర్జన్మ సాధ్యమనే నమ్మకం ఆమెలో కలిగింది. ఆ నమ్మకాన్నే ఆమె తన తల్లిదండ్రుల్లో కలిగేలా చేసింది. తాను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కపై పునర్జన్మ ప్రయోగం చేసానని.. కుక్కని చంపి మళ్ళీ బ్రతికించానని చెప్పింది. ఆమె మాటలను తల్లిదండ్రులు విశ్వసించారు. అంతేకాదు, చిన్నకుమార్తె సాయి దివ్యపై పునర్జన్మ ప్రయోగాలు చేయడానికి అంగీకరించారు. అదే వాళ్ళు చేసిన పెద్ద తప్పు. పునర్జన్మ పేరుతో సాయి దివ్యను చంపేశారు. అయితే ఆమె తిరిగి బ్రతకకపోవడంతో.. అలేఖ్య తనని చంపమని కోరింది. ఇద్దరం కలిసి మళ్ళీ జన్మిస్తామని చెప్పింది. పునర్జన్మ మాయలో పడిపోయిన తల్లి.. అలేఖ్యను కూడా చంపేసింది. ఇలా పునర్జన్మ ప్రయోగాల పేరుతో కన్న తల్లే ఇద్దరు కూతుళ్ళని పొట్టన పెట్టుకుంది. ఈ విషయాన్ని తండ్రి పురుషోత్తమ నాయుడు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది.