ప్రేమజంట ఆత్మహత్య
Published on: Fri Apr 10, 2026 4:05PM

పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు కోట పరిధిలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమలో ఉన్న యువ జంట ఆత్మహత్యకు పాల్పడి, చికిత్స పొందుతూ వరుసగా మృతి విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గుంటూరు స్వర్ణ భారతి నగర్ కు చెందిన 20 ఏళ్ల రసిక మణికంఠ రాజు, అంకమ్మనగర్ కి చెందిన యువతి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించక పోవడంతో పాటు ఆ యువతికి ఇటీవల వేరే వ్యక్తితో వివాహం జరిగింది.
వివాహం అనంతరం మనస్తాపానికి గురైన యువతి తన భర్తతో ఉండలేనంటూ గుంటూరుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన ఇద్దరూ కొండవీడు కోట ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వారు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు గమనించి వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువకుడు మణికంఠ రాజు ఈ నెల8న మరణించగా, ఆ యువతి గురువారం (ఏప్రిల్ 9)న కన్నుమూసింది.ఈ ఘటనపై మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


