ప్రేమ ప్రయాణం... విషాదాంతం...

 

తమిళనాడులోని వేలూరు జిల్లా ఆంబూరు గ్రామానికి చెందిన యువతీ యువకులు ప్రేమ ప్రయాణం విషాదాంతమైంది. ఆ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. పెళ్ళి చేసుకోవాలని అనుకున్నారు. అయితే వాళ్ళిద్దరి తరఫు పెద్దలు వీరి ప్రేమకి, పెళ్ళికి నో చెప్పారు. దాంతో వాళ్ళిద్దరూ పారిపోయి పెళ్ళి చేసుకోవాలని అనుకున్నారు. శనివారం నాడు వీళ్ళిద్దరూ చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిలో బైకు మీద ఆంబూరు వైపు వెళుతుండగా వేలూరు సమీపంలోని అలిమేలుమంగాపురం వద్ద ముందు వెళుతున్న లారీని బైకు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మరణించగా, ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా వున్నట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటన విషయం తెలుసుకున్న ఇద్దరి పెద్దలు వీరి ప్రేమకు తాము అంగీకారం తెలిపినా ఇంత ఘోరం జరిగివుండేది కాదని బాధపడుతున్నారు.