ఏపీ రాజధాని అమరావతి.. బిల్లుకు లోక్ సభ ఆమోదం.. రేపు రాజ్యసభ ముందుకు
Published on: Wed Apr 1, 2026 3:00PM

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని స్థిరపరుస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవరణ బిల్లు-2026 కు లోక్సభ బుధవారం (ఏప్రిల్ 1) ఆమోదం తెలిపింది. లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందడం అమరావతికి చట్టపరమైన రక్షణ దిశగా అత్యంత కీలక ముందడుగు పడినట్లైంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టగా, విస్తృత చర్చ అనంతరం మెజారిటీ సభ్యుల మద్దతుతో బిల్లును సభ ఆమోదించింది. సభలో ఈ బిల్లుపై దాదాపు రెండు గంటల పాటు చర్చ జరిగింది.
సభలో ఈ బిల్లుపై సుమారు రెండు గంటల పాటు అర్థవంతమైన చర్చ జరిగింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ సభ్యులు కూడా ఈ బిల్లుకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అయితే.. చర్చ జరుగుతున్న సమయంలో వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ బిల్లు ఆమోదం పొందినట్లు అధికారికంగా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవరణ 2024 జూన్ 2 నుండి అమల్లోకి వచ్చేలా నిబంధనలను రూపొందించారు. దీనివల్ల గతంలో ఉన్న రాజకీయ అనిశ్చితికి తెరపడి, అమరావతి అభివృద్ధికి చట్టపరమైన అడ్డంకులు తొలగిపోనున్నాయి. రాష్ట్ర విభజన హామీల అమలులో భాగంగా అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.
లోక్సభ ఆమోదం పొందిన ఈ బిల్లును గురువారం (ఏప్రిల్ 2) రాజ్యసభ ముందుకు రానుంది. ఎగువ సభలో కూడా బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి సంతకంతో ఇది పూర్తిస్థాయి చట్టంగా మారుతుంది. తద్వారా జగన్ తన హయాంలో తీసుకువచ్చిన మూడు రాజధానుల వివాదానికి, విధానానికి శాశ్వతంగా ముగింపు పలికినట్లౌతుంది. ఈ పరిణామంతో అమరావతి ప్రాంత రైతులు సహా ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


