లోకేష్ యువగళం పాదయాత్రకు మూడేళ్లు
Published on: Tue Jan 27, 2026 1:58PM
.webp)
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించి మంగళవారం (జనవరి 27) నాటికి మూడేళ్లు పూర్తైంది. 2023 జనవరి 27న కుప్పంలోని శ్రీవరదరాజస్వామి పాదాల చెంత యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు లోకేష్. రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజా చైతన్యమే లక్ష్యంగా లోకేష్ యువగళం పాదయాత్ర సాగింది. కుప్పంలో ప్రారంభమైన యువగళం యాత్ర 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, మొత్తం 32 మున్సిపాలిటీలు, మండలాలు, 2,097 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్ల మేర సాగింది.
లోకేశ్ పాదయాత్ర నిర్వహించిన 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఈ యాత్ర విజయానికి నిదర్శనంగా నిలిచింది. యువగళం పాదయాత్ర మూడేళ్ల సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పార్టీ నేతలు, శ్రేణులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు.

మంగళవారం (జనవరి 27) ఉదయం పార్టీ కార్యాలయానికి చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్కు టీడీపీ నేతలు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. యువగళం పాదయాత్ర మూడేళ్ల సందర్భాన్ని గుర్తుచేస్తూ లోకేశ్తో కేక్ కట్ చేయించి సంబరాలు చేసుకున్నారు. ఏపీ రాజకీయాల్లో యువగళం పాదయాత్ర గేమ్ ఛేంజర్గా నిలిచిందని ఆ పార్టీ నేతలు కొనియాడారు.


