TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లోకేష్ పాదయాత్ర@1000 కిలోమీటర్లు!

Published on: Fri Apr 21, 2023 4:16PM

విజయానికి తొలి మెట్టు విశ్వాసం .. మలి మెట్టు పట్టుదల.. ఈ రెండు కలిస్తే  అది లోకేష్ యువగళం పాదయాత్ర. అవును, తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  విశ్వాసం ఊపిరిగా, పట్టుదల శ్వాసగా సాగిస్తున్న యువగళం పాదయాత్ర శుక్రవారం (ఏప్రిల్ 21)  వెయ్యి కిలోమీటర్ల  మైలు రాయిని చేరుకుంది. ఈ ఏడాది ( 2023) జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి మొదలైన యువగళం పాదయాత్ర,   శుక్రవారం (ఏప్రిల్ 21) నాటికి 77వ రోజుకు చేరుకుంది. సరిగ్గా ఇదే రోజున ఆయన పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు  పూర్తి చేసుకోనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.  శుక్రవారం(ఏప్రిల్ 21) ఉదయం   ఆదోని శివారు క్యాంప్ సైట్ నుంచి 77వ రోజు యువగళం పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు.  ఆదోని టౌన్ సిరిగుప్ప క్రాస్ వద్ద  లోకేష్ పాదయాత్ర 1000 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకుంది. ఈ నేపథ్యంలో  సాయంత్రం 6 గంటలకు కడికత్త క్రాస్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న అరాచక పాలన, ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు, ముఖ్యంగా యువతకు వివరించే లక్ష్యంతో 400 రోజులలో 4 వేల కిమీ పాదయాత్రను ప్రారంభించి నప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా అనేక అవరోధాలు సృష్టించింది. ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం లోకేష్ పాదయాత్రపై పాతికకు పైగా కేసులు పెట్టింది. యాత్రను అడ్డుకోవడమే లక్ష్యంగా ఓ వంక పోలీసులు మరో వంక,  వైసీపీ కార్యకర్తలు,  నాయకులు అవరోధాలు సృష్టిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో యాత్ర ప్రారంభానికి ముందే ప్రచార రథం, మైకు, సౌండ్ సిస్టం ఇతర ప్రసార సాధనాలను, ఉపకరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుప్పం నుంచి తంబళ్ళపల్లి మధ్యలో సగటున ప్రతి 20 కిలోమీటర్లకు ఒక కేసు చొప్పున పెట్టారు. దీనిని బట్టే పోలీసులు లోకేష్ పాదయాత్ర విషయంలో ఎంత దుర్మార్గంగా వ్యహరించారో వేరే చెప్పనక్కర లేదు.  అయినా లోకేష్, ఎవరికి  చెప్పవలసిన సమాధానం వారికీ చెపుతూ  మొక్కవోని ధైర్యంతో ముదుకు సాగుతున్నారు.

అంతే కాదు, పాద యాత్రతో పాటుగా లోకేష్ ఎక్కడి కక్కడ వివిధ వర్గాల ప్రజలతో ప్రత్యేకంగా సమావేశ మవుతున్నారు. సమస్యలు అడిగి తెలుసు కుంటున్నారు. వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. తెలుగు దేశం అధికారంలోకి వస్తే  ప్రజలు తమ ముందుంచిన సమస్యలను ఎలా పరిష్కరిస్తామో వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.  

అలాగే, ప్రతి నియోజక వర్గంలో బహిరంగ సభలు నిర్వహించి ఆ నియోజక వర్గం వైసీపీ ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా  సహా ప్రజల ముందుంచుతున్నారు. చర్చకు సిద్దమని సవాళ్లు  విసురుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మూతపడిన సంస్థలు, అన్న కాంటీన్ల ముందు సేల్ఫీలు దిగుతూ ...జగన్ రెడ్డి సర్కార్’ సెల్ఫి సవాళ్ళు విసురుతున్నారు.. దీంతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్ళు  పరుగెడుతున్నాయి. అందుకే యాత్ర ప్రారంభంలో అవహేళన చేసిన వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు జాగ్రత్త పడుతున్నారు. జన ప్రభంజనమై సాగుతున్న యువగళం గర్జనలకు భీతిల్లి పోతున్నారు.