TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాయలసీమకు పట్టిన క్యాన్సర్ జగన్.. లోకేష్

Published on: Fri May 22, 2026 7:36AM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి నారా లోకేష్ విమర్శల వర్షం కురిపించారు. రాయలసీమ బిడ్డగా చెప్పుకునే జగన్ నిజానికి రాయలసీమకు పట్టిన క్యాన్సర్ అన్నారు.  కడప పర్యటనలో భాగంగా లోకేష్, రాయలసీమ అభివృద్ధి, గత ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడారు.  జగన్   మాటలు తప్పడం, మడమ తిప్పడంలోనే దిట్ట అన్న లోకేష్..   ఐదేళ్ల వైసీపీ పాలనలో రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని, నిర్లక్ష్యాన్ని   గణాంకాలతో సహా ఎండగట్టారు. జగన్ హయాంలో సీమ ప్రాంత ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు.  

రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో   టీడీపీ ప్రభుత్వానికి, వైసీపీ పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని నారా లోకేష్ ఈ సందర్భంగా స్పష్టంగా వివరించారు. గతంలో అంటే 2014 - 2019 కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ సాగునీరు, తాగునీటి ప్రాజెక్టుల కోసం ఏకంగా రూ. 11,000 కోట్లు ఖర్చు చేసిందని ఆయన గుర్తుచేశారు.  అయితే.. సీమ బిడ్డనని గొప్పలు చెప్పుకునే జగన్ తాను సీఎంగా ఉన్న  ఐదేళ్ల ముఖ్యమంత్రి కాలంలో కేవలం రూ. 2,700 కోట్లు మాత్రమే కేటాయించి ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఎడారిగా మార్చేందుకు ప్రయత్నించారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అప్పర్ తుంగభద్ర ప్రాజెక్టు కోసం రూ. 5,300 కోట్లు కేటాయించినప్పుడు, దానివల్ల రాయలసీమకు జరిగే నష్టాన్ని ఆపడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్ల మరమ్మతులను సైతం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాయలసీమ రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచిన డ్రిప్ ఇరిగేషన్  అంటే బిందు సేద్యం ) వ్యవస్థను జగన్  రద్దు చేసి రైతుల పొట్ట కొట్టారని విమర్శించారు.   టీడీపీ  హయాంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీతో, అలాగే మిగిలిన రైతులకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను అందించి అండగా నిలిచిందని గుర్తు చేశారు.  తన  వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి జగన్ డ్రామాలు ఆడుతున్నారని, ఆయన నటన చూస్తే  ఆయనకు భాస్కర్ అవార్డు ఖాయంగా వస్తుందని ఎద్దేవా చేశారు.  సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి అత్యంత దారుణంగా హత్యకు గురైతే, ఆ ఘోరమైన నిజాన్ని కప్పిపుచ్చి రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబుపైకి నెట్టేందుకు జగన్ ఎంతటి డ్రామాలు ఆడారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమను పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.  మిషన్ రాయలసీమ  పేరుతో ఈ ప్రాంతాన్ని ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్,  డిఫెన్స్ హబ్‌గా మారుస్తున్నామన్న లోకేష్ . పుట్టపర్తిలో  ఐదో తరం యుద్ధ విమానాల (ఎఎంసీఏ) తయారీ కేంద్రానికి రూ. 15,803 కోట్లతో శంకుస్థాపన చేయడం రాయలసీమ చరిత్రలోనే ఒక మైలురాయి అని పేర్కొన్నారు. జగన్ పాలన కేవలం ఫ్యాక్షనిజం, కమిషన్ల చుట్టూ తిరిగితే, తమ కూటమి ప్రభుత్వం ఫైటర్ జెట్ల తయారీతో సీమ యువతకు ఉపాధి కల్పిస్తోందని గర్వంగా ప్రకటించారు. రాబోయే రోజుల్లో రాయలసీమను రత్నాల సీమగా మార్చేందుకు కట్టుబడి ఉన్నామని నారా లోకేష్ పునరుద్ఘాటించారు.