TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబుకు ప్రధాని పదవి వదంతులపై లోకేష్ ఏమన్నారంటే?

Published on: Tue Jun 23, 2026 12:19PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చుట్టూ ఆసక్తికరమైన చర్చ  నడుస్తున్నాది.  తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలలోకి ప్రవేసిస్తున్నారనీ, ఆయనకు ప్రధాని పదవి దక్కబోతోందంటూ  పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి. ఈ విషయంలో ముఖేష్ అంబానీ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. ముఖేష్ అంబానీ, మాజీ ఉపరాష్ట్రపతి  జగదీప్ ధన్ ఖర్ లు కలిసి మోడీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ప్రయత్నించారనీ, ఆ ప్రయత్నం విఫలమవ్వడంతో ముఖేష్ అంబానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అమరావతిలో భేటీ అయ్యారనీ, ఆ సందర్భంగా ప్రధాని పదవి రేసులో చంద్రబాబు ఉండాలని ఆఫర్ చేశారనీ జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరిగింది.  ఈ చర్చోపచర్చలు, ఊహాగాన సభలపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా వేదికగా క్లారిటీ ఇచ్చారు.  దేశానికి నరేంద్ర మోదీ రూపంలో ఒక  బలమైన ప్రధానమంత్రి ఉన్నారన్న లోకేష్.. చంద్రబాబు ప్రధాని అన్న చర్చకు, వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.  

కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశానికి తిరుగులేని రాజకీయ స్థిరత్వాన్ని అందిస్తోందన్న లోకేష్.. జాతీయ స్థాయిలో మోదీ ప్రవేశపెడుతున్న ఆర్థిక, పారిశ్రామిక సంస్కరణలు దేశాన్ని అగ్రపథాన నిలుపుతున్నాయన్నారు.  ఇక ఏపీలో తమ దృష్టి అంతా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం,  ప్రగతిపైనే ఉందని   ఉద్ఘాటించారు.  వైసీపీ  ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందనీ,  రాజధాని అమరావతి అభివృద్ధిని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేశారని చెప్పిన లోకేష్..   ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ అందిస్తున్న మద్దతు మరువలేనిదని లోకేష్ పేర్కొన్నారు.

అమరావతి నిర్మాణానికి చట్టబద్ధమైన రక్షణ కల్పిస్తూ లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడం చారిత్రాత్మక పరిణామమని, అందుకే తాను వ్యక్తిగతంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసి మంగళగిరి చేనేత శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపానే తప్ప..  అందులో ఎలాంటి రాజకీయ లబ్ధి లేదా పదవుల ఆశ లేదని కుండబద్దలు కొట్టేశారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఏపీని నిలబెట్టడమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు లక్ష్యమన్నారు.