TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు.. యువకుడి బలవన్మరణం

Published on: Sat Mar 28, 2026 10:40AM

లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. ఈ యాప్ ల వలలో పడి ఎందరో నిండు ప్రాణాలను బలవంతంగా తీసేసుకుంటున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీటిని నియంత్రించడానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు అంతగా సత్ఫలితాలను ఇస్తున్నట్లు కనిపించదు. తాజాగా కాకినాడ జిల్లాలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.  వివకాలిలా ఉన్నాయి.

 అనకాపల్లి జిల్లా వడ్డాదిమాడుగుల గ్రామానికి చెందిన 22 ఏళ్ల మహమ్మద్ బషీర్   కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఒక  ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మెరుగైన భవిష్యత్తు కోసం పట్టణానికి వచ్చిన బషీర్, కొంతకాలం క్రితం అవసరాల నిమిత్తం ఒక ఆన్‌లైన్ లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. తీసుకున్న అప్పును సకాలంలో చెల్లించడంలో ఇబ్బందులు ఎదురవడంతో, లోన్ యాప్ నిర్వాహకులు బషీర్‌పై ఒత్తిడి పెంచారు. ఫోన్ కాల్స్ ద్వారా వేధించడమే కాకుండా, అసభ్యకరంగా మాట్లాడుతూ మానసిక క్షోభకు గురిచేశారు.

ఈ క్రమంలోనే యాప్ నిర్వాహకుల వేధింపులు మితిమీరిపోవడంతో..  తీవ్ర మనస్తాపానికి గురైన బషీర్ తాను ఉంటున్న గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  తమ కుమారుడి మృతికి కారణమైన లోన్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆన్‌లైన్ రుణాల విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని, లేనిపక్షంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని సామాజిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి అక్రమ లోన్ యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.