జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్
Published on: Fri Jun 5, 2026 8:49PM

జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆయన అధికారికంగా ప్రకటించారు. 2015 నుంచి జనసేన పార్టీతో పాటు పవన్ కళ్యాణ్తో లింగమనేని రమేష్కు సన్నిహిత అనుబంధం ఉంది. రాష్ట్ర అభివృద్ధికి అన్ని సామాజిక వర్గాల మధ్య సఖ్యత అవసరమనే పవన్ కళ్యాణ్ ఆలోచనలకు ఆకర్షితులై ఆయనతో కలిసి ప్రయాణిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం లింగమనేని రమేష్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
2019 ఎన్నికల్లో పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ జనసేన సిద్ధాంతాలపై, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంపై విశ్వాసం కోల్పోకుండా నిలిచిన వారికి జనసేన ప్రాధాన్యం ఇస్తోందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్ని ఒత్తిళ్లు, సవాళ్లు ఎదురైనా పార్టీతోనే కొనసాగిన నాయకులకు నామినేటెడ్ పదవుల్లో కుల, మతాలకు అతీతంగా అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపాయి. అదే సూత్రాన్ని రాజ్యసభ అభ్యర్థి ఎంపికలో కూడా పవన్ కళ్యాణ్ అనుసరించినట్లు పార్టీ వెల్లడించింది.


