TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేబినెట్ లోకి నాగబాబు.. లైన్ క్లియర్!

Published on: Thu Mar 6, 2025 11:24AM

ఏపీ క్యాబినెట్లో ఖాళీగా ఉన్న ఒక్క మంత్రి పదవి జనసేనాని సోదరుడు, మెగా బ్రదర్ నాగబాబుకు‌ కన్‌ఫర్మ్ అయినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడో ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగా యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నాగబాబు పేరు ఖరారైంది. నాగబాబుకు ఏ శాఖ దక్కుతుందనే చర్చ మొదలైంది. నాగబాబు పేరు ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఖరారవ్వడంతో మెగా ఫ్యామిలీ నుంచి మూడో మంత్రి రాబోతున్నారని జనసైనికులు హ్యాపీ అయిపోతున్నారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన  అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సోదరుడు, జనసేన నేత నాగబాబు పేరు ఖరారైంది. ఎమ్మెల్యే కోటా అభ్యర్థిగా ఆయన పేరును జనసేన అధినేత పవన్‌ ఖరారు చేశారు. ఈ నెల 20న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వడంతో నామినేషన్‌ వేయాలని నాగబాబుకు పవన్ సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్నారు. నామినేషన్‌కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కొద్దిరోజుల కిందట ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు టీడీపీ, ఒకటి బీజేపీ తీసుకున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. పవన్‌ కల్యాణ్‌ కోరిక మేరకు  ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానం ఆయన కోసం కేటాయించారు.  

 శాసనమండలి ఎన్నికల షెడ్యూలు వెలువడిన తరువాత నాగబాబుకు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. అలాగే నాగబాబు రాజ్యసభ అంటే ఆసక్తిగా ఉన్నారని, విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ బెర్త్‌ను నాగబాబుకి కేటాయిస్తారన్న ఊహాగానాలూ వినిపించాయి. నాగబాబు స్థానంలో ఎమ్మెల్సీగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి అవకాశమిస్తారన్న టాక్ కూడా స్ప్రెడ్ అయింది. అయితే  విజయసాయి రెడ్డి రాజ్య సభ స్థానాన్ని ఖాళీ చేయించింది బీజేపీ కాబట్టి, ఆ స్థానాన్ని కమలం పార్టీకి వదలాలి అనే సూచనలు కూడా వచ్చాయి. ఆ క్రమంలో, తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగానే నాగబాబు పేరును ఖరారు చేశారు.

ఇక ఐదుగురు ఎమ్మెల్సీలో నాగబాబు పేరు ఖరారవగా.. మిగిలిన నాలుగు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. అయితే నాగబాబు రాజ్యసభకు వెళ్తే ఐదు ఎమ్మెల్సీల్లో ఒకటి టీడీపీ నుంచి వంగవీటి రాధాకు ఇస్తారనే అంతా భావించారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీగా నాగబాబు పేరు ఖరారు చేయడంతో కాపు సామాజికవర్గం లెక్కలతో ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కేబినెట్ సమావేశం అనంతరం ఎమ్మెల్సీలు ఎవరనేది ప్రకటించనున్నట్లు సమాచారం. 

అయితే ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి బీజేపీ అడగగా.. ఇప్పటికే ఒక స్థానం నాగబాబుకు ఇచ్చేయడంతో బీజేపీకి ఇచ్చే అవకాశం లేదని చంద్రబాబు ముందుగానే స్పష్టం చేసినట్లు తెలిసింది. మరి మిగిలిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఎవరు అనేది ఉత్కంఠంగా మారింది.. అదలా ఉంటే ఏపీ క్యాబెనెట్లో ఖాళీగా ఉన్న ఒక్క మంత్రి పదవి మెగా బ్రదర్ నాగబాబుకు‌ కన్‌ఫర్మ్ అయినట్లు చంద్రబాబు ఎప్పుడో ప్రకటించారు. నాగబాబుని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేయాలని నిర్ణయించడంతో.. ఇక ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టడం లాంఛనంగానే కనిపిస్తుంది.  

ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతూ, ఆరు కీలక శాఖలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు నాగబాబు కొణిదెల ఫ్యామిలీ నుంచి మూడో మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతుండటంతో జనసైనికులు తెగ హ్యాపీ అయిపోతున్నారు.