TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమరావతికి చట్టబద్ధత.. స్వాగతించిన స్వప్నాదత్

Published on: Wed Apr 8, 2026 5:27PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన అమరావతి రాజధాని అంశంపై సినీ పరిశ్రమ ఆమోదయోగ్యం కాని మౌనం వహిస్తున్నది.  అయితే ఈ ఒక్క విషయం అనే కాదు.. గత కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల విషయంలో టాలీవుడ్ స్పందించడం కంటే మౌనమే మేలన్నట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నది. జగన్ హయాంలో చిత్రపరిశ్రమ విషయంలో  ఆయన అనుసరించిన తీరు, అవమానించిన విధం నుంచి టాలీవుడ్ ఇప్పటికీ తేరుకోనట్లుగానే కనిపిస్తున్నది. అందుకే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మౌనం వీడలేదు. 

ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత విషయంలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మౌనంగానే ఉండిపోయి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నది. ఎందుకంటే.. అమరావతిని రాజధానిగా జగన్ వ్యతిరేకిస్తున్నారు కనుక. సపోజ్ ఫర్ సపోజ్ రేపు ఆయన అధికారంలోకి వస్తే అమరావతికి మద్దతుగా మాట్లాడిన వారిపై ప్రతీకార చర్యలకు దిగుతారన్న భయమే అందుకు కారణంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అమరావతికి మద్దతుగా హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గళం విప్పినా.. వారిరువురూ రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్నారు. ఆ కారణంగా వారి అభిప్రాయం చిత్రపరిశ్రమ అభిప్రాయంగా భావించలేని పరిస్థితి ఉంది. అయితే గతంలో అంటే జగన్ హయాంలో జగన్ నిర్ణయాలను ధైర్యంగా ఇసుమంతైనా జంకు లేకుండా విమర్శించిన అశ్వినీదత్ అప్పట్లో తన గళాన్ని గట్టిగా వినిపించారు.

ప్రముఖ సినీ నిర్మాత అయినా.. పలు భారీ చిత్రాలు నిర్మాణంలో ఉన్నప్పటికీ  ఏ మాత్రం భయం లేకుండా జగన్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు.ఇక ఇప్పుడు ఆయన కుమార్తె స్వప్ప దత్.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల కావడాన్ని స్వాగతించారు.  ఈ మేరకు ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్టుకు అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ను షేర్ చేశారు.

చిత్రపరిశ్రమలో ఉంటూ భారీ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నా కూడా స్వప్నా అశ్వినీదత్.. రాష్ట్ర రాజకీయాలపై తన అభిప్రాయాలను నిస్సంకోచంగా, ధైర్యంగా వెళ్లడించడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆమె రాజకీయ పరిణామాలపై తన మనసులోని మాటను ధైర్యంగా చెప్పడం పట్ల నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.