TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎల్‌బీ నగర్ అభివృద్ధికి భారీ ప్రణాళికలు : సీఎం రేవంత్ రెడ్డి

Published on: Thu Jun 18, 2026 8:59PM

 

ఎల్‌బీ నగర్ ప్రజలతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది...

ఎల్‌బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 2018లో కొడంగల్‌లో రాజకీయ కుట్రల కారణంగా ఓడిపోయిన సమయంలో చాలా మంది తన రాజకీయ భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తం చేశారని గుర్తు చేశారు. అయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అండగా నిలిచి మల్కాజ్‌గిరి ఎంపీగా అవకాశం కల్పించారని చెప్పారు.

మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎల్‌బీ నగర్ ప్రజలు 30 వేల మెజారిటీ ఇచ్చి తనను గెలిపించారని, ప్రజల తరఫున పార్లమెంట్‌లో గట్టిగా పోరాడినందుకే పార్టీ తనకు పీసీసీ అధ్యక్ష పదవి అప్పగించిందన్నారు. పీసీసీ చీఫ్‌గా మూడేళ్లు పోరాడి ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

ఎల్‌బీ నగర్, బీఎన్ రెడ్డి, వనస్థలిపురం, గుర్రంగూడా ప్రాంతాలు గతంలో నిర్లక్ష్యానికి గురయ్యాయని, ఇప్పుడు వాటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని సీఎం పేర్కొన్నారు. రూ.2,400 కోట్లతో 240 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్ నిర్మిస్తున్నామని వెల్లడించారు.

గుర్రంగూడా ఎకో పార్క్ భూములను ప్రైవేట్ లేఅవుట్లుగా మార్చే ప్రయత్నాలను ప్రభుత్వం అడ్డుకుందని, సుప్రీంకోర్టులో కేసు గెలిచి 424 ఎకరాలను నేషనల్ పార్క్‌గా ప్రజలకు అంకితం చేశామని తెలిపారు. చెరువులు, నాలాల ఆక్రమణల వల్ల కాలనీలు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

హైడ్రా (HYDRAA)పై జరుగుతున్న విమర్శలను ప్రస్తావిస్తూ, సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకున్న వారి జోలికి హైడ్రా వెళ్లదని స్పష్టం చేశారు. చెరువులు, పార్కులు, నాలాలను ఆక్రమించిన వారిపైనే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కొద్ది మంది ఆక్రమణదారుల వల్ల వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మూసీ నది ప్రక్షాళన, చెరువుల పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గతంలో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులు నగర అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయని గుర్తు చేశారు.

భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. 30 వేల ఎకరాల్లో రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టులో 15 వేల ఎకరాలను అటవీ అభివృద్ధికి కేటాయిస్తున్నామని, 60 శాతం పచ్చదనం ఉండేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. అంతర్జాతీయ కంపెనీలను తీసుకొచ్చి భవిష్యత్ తరాలు గర్వించేలా భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని స్పష్టం చేశారు.

మూసీ కాలుష్యం వల్ల నల్గొండ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మూసీ ప్రక్షాళనను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మేర అంతర్జాతీయ ప్రమాణాలతో మూసీ అభివృద్ధి చేపడతామని వెల్లడించారు.