ఏలూరు ఎంపీగా పోటీ.. లగడపాటి క్లారిటీ

 

వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున ఏలూరు ఎంపీగా లగడపాటి రాజగోపాల్ పోటీ చేస్తారంటూ కొద్దిరోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం పై తాజాగా లగడపాటి స్పందించారు. తాను వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న మాజీ జడ్పీటీసీ, టీడీపీ మహిళా నేత భారతిని పరామర్శించేందుకు లగడపాటి ఇటీవల మునగపాడు గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను కలిసేందుకు స్థానిక నేతలంతా అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో మీరు ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయని లగడపాటిని కొందరు ఆసక్తిగా అడిగారు. అలాంటిది ఏమి లేదని ఆయన నవ్వుతూ సమాధానం చెప్పారు.