చంద్రబాబుతో లగడపాటి..ఫెడరల్ ఫ్రంట్‌పై మాట్లాడను

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కలిశారు. ఉండవల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన లగడపాటి.. ఆయనతో కొద్దిసేపు భేటీ అయ్యారు. ఈ నెల 27న తన ఇంట్లో జరిగే శుభకార్యానికి రావాల్సిందిగా చంద్రబాబును ఆయన ఆహ్వానించారు. అనంతరం లగడపాటి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. కేసీఆర్‌ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్‌పై ఇప్పుడేమి వ్యాఖ్యలు చేయలేనన్నారు. రాజకీయాలపై మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదని లగడపాటి తెలిపారు. మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ఓటమి తప్పదు అని లగడపాటి చెప్పగా..అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మీడియాకి దూరంగా ఉన్న లగడపాటి ఈరోజు చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియా కంటపడ్డారు.