TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లడ్డూ ప్రసాదం... వైసీపీ వింత ప్రకటనలు!

Published on: Mon Sep 23, 2024 4:26PM

పరమ పవిత్రమైన తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి అడ్డంగా దొరికిపోయిన వైసీపీ చేసిన తప్పు నుంచి తప్పించుకోవడానికి సర్వప్రయత్నాలు చేస్తోంది. అధికారం వెలగబెట్టిన కాలంలో జగన్ ప్రభుత్వం చేసిన ఈ దౌర్భాగ్యపు పనిని యావత్ దేశం అసహ్యించుకుంటోంది. లడ్డూని తయారు చేయడానికి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడటం వల్ల హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ విషయంలో కేవలం హిందువులు మాత్రమే జగన్ మీద ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు. ఇతర మతాల వారు కూడా ఈ ఘోరాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఏ మత విశ్వాసాన్నీ ఇంత దారుణంగా దెబ్బతీయకూడదని అంటున్నారు. జాతీయ మీడియా అయితే జగన్‌ని ఫుట్‌బాల్ ఆడుకుంటోంది. ఒక్క లడ్డూ విషయంలో మాత్రమే కాకుండా అధికారాన్ని వెలగబెట్టిన సమయంలో జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయాలు, అక్రమాల చిట్టాని బయటకి తీసి కథనాలుగా అందిస్తోంది.  స్వామివారి లడ్డూని అపవిత్రం చేసిన పాపం జగన్ రాజకీయ కెరీర్‌నే సమాధి చేసే శాపంలా మారింది. ఇంత జరిగినా వైసీపీ నాయకులు తప్పుని ఒప్పుకోకుండా తప్పించుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. కానీ, ఆ ప్రయత్నాల సందర్భంగా వాళ్ళు చేస్తున్న తప్పులు జనానికి మరింత ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో జరిగిన అపచారానికి మనోవేదన చెందిన ఏపీ డిప్యూటీ సీఎం ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. ఈ దీక్ష మీద కూడా వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారు. పవ‌న్‌ టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అందులో ప్రధానంగా పేర్కొంటున్న కామెంట్ ఏమిటంటే, పవన్ కళ్యాణ్ ఒకసారి తన తండ్రి కొణిదెల వెంకట్రావు గురించి చెబుతూ, తన తండ్రి దీపారాధనతో సిగరెట్ వెలిగించుకునేవారని చెప్పారు. అలాంటి తండ్రికి పుట్టిన కొడుకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు హిందూ మతానికి అన్యాయం జరుగుతోందని బాధపడుతున్నారు అని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి కామెంట్లు పెట్టడం ద్వారా వైసీసీపీ నాయకులు తమ లేకితనాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ తండ్రి ఏదో చేస్తే, ఆయన కొడుకు హిందూ మత విశ్వాసాల గురించి మాట్లాడ్డమేంటని అనడం అజ్ఞానానికి అతిపెద్ద ఆనవాలు. తండ్రి అలా అయినంతమాత్రాన కొడుకు కూడా అలాంటి వాడేనా? ఆ లెక్కకొస్తే, జగన్ తాత వైఎస్ రాజీరెడ్డి బ్రిటీష్ వాళ్ళకి పంది మాంసం సరఫరా చేసేవాడు. అలాంటి తాతకు మనవడు కాబట్టి జగన్ పందికొవ్వు కలసిన నెయ్యితో స్వామివారి లడ్డూలు చేయించారని అనుకోవచ్చు కదా. ఒక కామెంట్ చేసేముందు ముందూ వెనుకా ఆలోచించే అలవాటు ఈ వైసీపీ వాళ్ళకి జీవితంలో రాదు! ఈ మేటర్ ఇంకా వుంది. పవన్ కళ్యాణ్ తండ్రి వెంకట్రావు దీపారాధన దీపంతో సిగరెట్ వెలిగించుకున్న మాట వాస్తవమే. ఈ విషయాన్ని ఒకసారి పవన్ కళ్యాణే స్వయంగా చెప్పారు. అయితే, ఆ తర్వాత ఏం జరిగిందో కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అలా దీపారాధనతో సిగరెట్ వెలిగించుకున్న నాస్తికుడైన తన తండ్రి ఆ తర్వాత రామభక్తుడిగా మారిపోయారని, నిరంతరం రామనామాన్ని జపిస్తూ వుండేవారని, తాను అజ్ఞానంతో చేసిన తప్పుని జీవితాంతం గుర్తు చేసుకుని బాధపడుతూ వుండేవారని చెప్పారు. ఈ వైసీపీ మూకలు ఇదంతా వదిలేసి ‘పవన్ కళ్యాణ్ తండ్రి దీపారాధన దీపంతో సిగరెట్ వెలిగించుకున్నాడు’ అంటూ ప్రచారం చేయడంలో బిజీగా వున్నాయి.

ఇక వైసీపీలో వున్న మరో కళాకారుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన ఒక గొప్ప కామెంట్ గురించి కూడా మనం చెప్పుకుని తరించాలి. నెయ్యిలో పంది కొవ్వు కలవటం గురించి ఆయన చేసిన కామెంట్లు వింటే, ఆయన బుర్రని ఏ మ్యూజియంలో పెట్టాలా అనే ఆలోచన ఎవరికైనా వచ్చితీరుతుంది. ఆయన చెబుతున్నదాని ప్రకారం... ‘‘ఆవు నెయ్యి రేటు రాగి లాంటిది. అదే పంది కొవ్వు ధర బంగారం లాంటిది. అలాంటప్పడు రాగిలాంటి ఆవు నెయ్యిలో బంగారం లాంటి పంది కొవ్వు ఎందుకు కలుపుతారు?’’ ఇదీ ఆయన వెర్షన్. ఆవు నెయ్యికంటే పంది కొవ్వే విలువైనది అని చెబుతూ తాము చేసిన తప్పును అడ్డదిడ్డంగా సమర్థించుకుంటున్న పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఆ వైఎస్ జగన్‌కి అసలు సిసలు ఫాలోవర్. ఈ మేటర్‌కి ముక్తాయింపు ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి వేడి వేడి కల్తీ నెయ్యిలో పడ్డారు. ఇక అందులో మునిగిపోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు.