TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దేశంలో 40 శాతం లోటు.. లడక్ లో మాత్రం 96శాతం అధిక వర్ష పాతం!

Published on: Wed Jun 17, 2026 3:13PM

ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురవడం లేదు. జూన్ నెలలో వానలు ముఖం చాటేశాయి. ఈ నెల 17 వరకూ అంటే బుధవారం వరకూ దేశ వ్యాప్తంగా సగటు వర్ష పాతం కంటే 40శాతం లోటు వర్షపాతం నమోదైంది. పంటల పరిస్థితిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. దేశంలోని పలు ప్రాంతాలలో కరవు చ్ఛాయలు కనిపించే అవకాశం ఉందన్న ఆందోళణ వ్యక్తం అవుతోంది. జూన్ 17 వచ్చినా దేశంలోని చాలా ప్రాంతాలలో వేసవి వాతావరణమే నెలకొని ఉంది. చురుకుగా కదలాల్సిన నైరుతి రుతుపవనాలు మందగించాయి.  సాథారణంగా జూన్ 17 నాటికి దేశ వ్యాప్తంగా   65.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది కేవలం 39.7 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది.

దేశ వ్యాప్తంగా వాతావరణం ఇలా నెలకొని ఉంటే..  హిమాలయాల ఒడిలో ఉండే చల్లటి ఎడారి   లడఖ్ లో మాత్రం   పూర్తి భిన్నమైన వాతావరం నెలకొంది.  ఎప్పుడూ పొడిగా ఉండే లడఖ్ ప్రాంతంలో  అనూహ్యంగా భారీ వర్షాలు కురిశాయి.   వాతావరణ శాఖ రికార్డుల ప్రకారం జూన్ 17 నాటికి లడఖ్‌లో సాధారణంగా కేవలం 2.2 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురవాల్సి ఉంది. కానీ ఈ సారి అక్కడ   4.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణంగా కురిసే వర్షపాతం కంటే 96 శాతం ఎక్కువ.  

మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్,  ఛత్తీస్‌గఢ్ వంటి ప్రాంతాలలో   వర్షపాతం లోటు 60 శాతం నుండి  100 శాతం వరకు నమోదైంది. అందుకు భిన్నంగా  లడఖ్‌లో  96శాతం అదనపు వర్షపాతం నమోదు కావడం వాతావరణ నిపుణులనే విస్మయ పరుస్తోంది.  ఈ విచిత్రమైన వాతావరణ మార్పులకు   వాతావరణ నిపుణులు  ఉత్తర భారతదేశం మీదుగా కదిలిన పశ్చిమ అలజడులు,  వాటి పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన తీవ్రమైన తేమ కారణంగా లడఖ్‌లో ఈ స్థాయి వర్షాలు కురవడానికి కారణంగా చెబుతున్నారు.

హిమాలయ పర్వత ప్రాంతాలలో వేగంగా మారుతున్న  వాతావరణ ధోరణుల పట్ల  పర్యావరణవేత్తలు ఆందోన వ్యక్తం చేస్తున్నారు.  కేవలం మంచు మాత్రమే కురిసే హిమాలయ ప్రాంతాల్లో ఇప్పుడు తరచూ వర్షాలు పడటం గ్లోబల్ వార్మింగ్ సంకేతంగా వారు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అసాధారణ మార్పులు  భవిష్యత్తులో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం  వంటి పర్యావరణ విపత్తుల ముప్పునకు సంకేతమని అంటున్నారు.