పోలవరం ప్రాజెక్టులో అవినీతి
posted on May 16, 2019 12:29PM
కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు.. కొద్దిరోజులుగా పోలవరం ప్రాజెక్టు విషయమై చంద్రబాబుని, టీడీపీని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇదే విషయమై.. ఆయన తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలిశారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కలసి వినతిపత్రాన్ని అందించినట్టు కేవీపీ వెల్లడించారు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసేందుకు కృషి చేయాలని కోరినట్టు వెల్లడించారు. ఏపీ ప్రజల బాగుకోసం ఈ ప్రాజెక్టు ఎంతో అవసరమని చెప్పానని పేర్కొన్నారు. తన నుంచి గవర్నర్ మరిన్ని వివరాలను కోరారని, తన వద్ద ఉన్న అన్ని వివరాలనూ ఆయనకు అందించానని తెలిపారు. తాను గవర్నర్ కు ఇచ్చిన వినతిపత్రంలో ఎన్నో విషయాలను పొందుపరిచానని, వాటన్నింటినీ పరిశీలించి చర్యలు తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారని కేవీపీ తెలిపారు.