TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కూకట్‌పల్లిలో దారుణం..బాలిక దారుణ హత్య

Published on: Mon Aug 18, 2025 4:13PM

 

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి సంగీత్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. పదేళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. తల్లిదండ్రులు ఆఫీసుకు వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న బాలికపై ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా విచారణలో తేలింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీంతో దర్యాప్తు చేస్తున్నారు.

సంగీత్‌నగర్‌లో కుమారుడు, కుమార్తెతో కలిసి దంపతులు నివాసముంటున్నారు. తండ్రి బైక్‌ మెకానిక్‌.. తల్లి ల్యాబ్‌ టెక్నీషియన్‌. బాలిక కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం తల్లిదండ్రులు తమ కుమారుడిని స్కూల్‌కు పంపి విధులకు వెళ్లారు. కుమార్తెకు స్కూల్‌ సెలవు కావడంతో ఇంట్లోనే ఒంటరిగా ఉంది.

మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కుమారుడి లంచ్‌ బాక్స్‌ తీసుకెళ్లేందుకు తండ్రి ఇంటికి వచ్చాడు. బెడ్‌రూమ్‌లో పొట్టపై కత్తి పోట్లతో బాలిక విగతజీవిగా పడి ఉండటాన్ని ఆయన గమనించాడు. దుండగులు బాలికను హతమార్చినట్లు గుర్తించి కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

బాలానగర్‌ డీసీపీ సురేశ్‌కుమార్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు .బాలిక హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలికపై లైంగిక దాడికి ఒక యువకుడు యత్నించాడు. ఆ బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆగ్రహానికి గురైన ఆ యువకుడు కత్తితో పొడిచి హత్య చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ కేసులో బాలిక ఒంటరిగా ఉందని తెలిసి బాలిక దగ్గరి బంధువువే హత్యకు ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.