లంగ్స్ ఇన్ఫెక్షన్ భయపెట్టింది! కేటీఆర్ కొవిడ్ అనుభవాలు 

కొవిడ్ ను జయించారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. కరోనా సోకడంతో ఆయన యశోధ హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నారు. దాదాపు మూడు వారాల తర్వాత ఐసోలేషన్ నుంచి బయటికి వచ్చారు. బుధవారం జరిగిన కొవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. గురువారం మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో (Ask KTR) ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించారు.ఆస్క్ కేటీఆర్ పేరిట జరిగిన ఈ సంభాషణ జాతీయస్థాయిలో ట్విట్టర్ ట్రెండింగ్లో నంబర్ వన్ గా నిలిచింది. ఈ కార్యక్రమంలో కొవిడ్ కు సంబంధించి నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు కేటీఆర్. తన కొవిడ్ అనుభవాలను కూడా కేటీఆర్ పంచుకున్నారు. కొవిడ్ సోకిన తర్వాత తన పరిస్థితి ఎలా ఉంది, తాను తీసుకున్న చికిత్స వివరాలను కేటీఆర్ వివరించారు. 

తనకు కరోనా సోకినప్పుడు వరుసగా ఏడు రోజులపాటు  తక్కువ నుంచి అతి ఎక్కువ డీగ్రీల జ్వరం కొనసాగిందని కేటీఆర్ చెప్పారు. దాంతోపాటు ఊపిరితిత్తుల్లో కొంత ఇన్ఫెక్షన్ కూడా వచ్చిందన్నారు.  తాను డయాబెటిక్ అయినందున బ్లడ్ షుగర్ మరియు హైపర్టెన్షన్ నియంత్రణ కొంత సవాలుగా ఉండిందని తెలిపారు. అయితే డాక్టర్ల సరైన సూచనలు సలహాలతో అన్ని సమస్యలను అధిగమించానన్నారు కేటీఆర్.  ప్రస్తుతం కొంత బలహీనంగా అనిపిస్తుందని, అయినప్పటికీ సాధారణ స్థితికి చేరుకున్నానని కేటీఆర్ తన కోవిడ్ రికవరీ అనుభవాన్ని పంచుకున్నారు

కొవిడ్ ను ఎలా ఎదుర్కొన్నారు, కోవిడ్ వచ్చిన వారికి మీరిచ్చే టిప్స్ ఏమిటని  ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.... కరోనా సోకిన సందర్భంగా మానసిక మరియు శారీరక ఆరోగ్యం పైన అత్యంత ప్రభావం చూపిస్తుందని కేటీఆర్ చెప్పారు. సొంత వైద్యం పనికిరాదని కేవలం వైద్యులు నిపుణులు సూచించిన ప్రామాణిక పద్ధతుల్లోనే వైద్యం తీసుకోవాలన్నారు. మానసికంగా బలంగా ఉండాలని, కోవిడ్ రికవరీ తర్వాత ఎలా ఉండాలో ముందే ప్లాన్ చేసుకోవాలని సూచించారు. అసత్యాలను, అర్ధ సత్యాలను ప్రచారం చేసే సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ వంటివాటికి దూరంగా ఉండాలని, ముఖ్యంగా వాట్సాప్ నిపుణుల సూచనలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోద్దన్నారు. వీలుంటే వ్యాయామం చేస్తే మంచిదన్నారు. ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఎవరికైనా covid symptoms ఉంటే వెంటనే మల్టీ విటమిన్లు మరియు ఇతర ప్రాథమిక మందులను తీసుకోవడం ప్రారంభించాలని, టెస్ట్ రిజల్ట్ కోసం వేచి ఉండద్దన్నారు కేటీఆర్.