TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గవర్నర్‌తో వివాదం.. కేటీఆర్ సెల్ఫ్‌ గోల్!

Published on: Fri Apr 8, 2022 12:00PM

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య, ఇంచు మించుగా గత నాలుగు మాసాలుగా ‘రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్’ అన్న రీతిలో, కోల్డ్ వార్’ జరుగుతోంది. ముఖ్యమంత్రి, మంత్రులు చివరకు అధికారులు కూడా గడచిన నాలుగు నెలలో రాజ్ భవన్ వైపు కన్నెత్తి చూడలేదు. ఒకటి రెండు సందర్భాలలో అనివార్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఒకరో ఇద్దరో మంత్రులు రాజ్ భవన్ గడప తొక్కినా, అదొక మొగ్గుబడి తంతుగానే మిగిలిపోయిందనే అభిప్రాయమే రాజకీయ మీడియా వర్గాల్లో వ్యక్తమైంది. అదే విధంగా ముఖ్యమంత్రి, మంత్రులే కాదు అధికారులు కూడా అనేక సందర్భాలలో ప్రొటోకాల్ నిబంధనలు ఉల్లంఘించారు. నిజంగా ప్రభుత్వానికి, అధికారులకు ఆ ఉద్దేశం ఉన్న లేకున్నా, ఉద్దేశ పూర్వకంగానే గవర్నర్’ను అవమానించారనే అభిప్రాయం అంతటా వ్యక్తమవుతూ వచ్చింది. 

అయినా, కారాణాలు ఏవైనా ఇంతవరకు కొంత మౌనంగా ఉన్న గవర్నర్ ఇప్పుడు పెదవి విప్పారు.కేంద్రం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షాలను విడివిడిగా కలిసి పరిస్థితిని వివరించారు.అంతే కాకుండా హోమ్ మంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత మీడియా ముందు కొచ్చారు. ప్రొటోకాల్‌ ఉల్లంఘనలు, తమకు జరిగిన అవమానాలతో పాటుగా, హైదరాబాద్ డ్రగ్స్ మాఫియా వ్యవహరం మొదలు రాష్ట్రంలో సాగుతున్న అవినీతి వ్యవహరాల వరకు చాలా విషయాలపై ఆమె మొదటి సారిగా మీడియా ముందు మాట్లాడరు. ఒక  విధంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టే విధంగ్ ఘాటైన వ్యాఖ్యలు, విమర్శలు చేశారు. 

అయితే గవర్నర్ వ్యాఖ్యలపై ఢిల్లీలోనే ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదు కానీ, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, రీయాక్టయ్యారు. గవర్నర్ రాజకీయ నేపధ్యాన్ని, మూలాలను ప్రశ్నించారు. హుజురాబాద్’ ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ నుంచి తెరాసలో చేరిన పాడి కౌశిక్ రెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా రాష్ట్ర కాబినెట్ చేసిన ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, కేటీఅర్,  పత్రికలో వచ్చిన వార్తల ఆధారంగా గవర్నర్’ నిర్ణయాన్ని తప్పు పట్టారు. గతంలో తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసిన రాజకీయ నేపధ్యం ఉన్న ఆమె గవర్నర్’గా నియమితులు కావడానికి అడ్డురాని రాజకీయ నేపధ్యం, కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ నియామకం విషయంలో ఎందుకు అడ్డువచ్చిందని, ప్రశ్నించారు. 

అయితే, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ నియామకం, గవర్నర్’ గా తమిళసై నియామకానికి పొంతన లేదని, బీజీపీ నాయకులు కేటీఆర్’కు కౌంటర్ ఇస్తున్నారు. నిజానికి. గవర్నర్ కోటాలో ‘కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినెట్ చేసిన ప్రతిపాదన విషయంలో ఆయన రాజకీయ నేపధ్యం ఆధారంగా గవర్నర్ అభ్యతరం చెప్పలేదని, బీజేపీ నాయకులూ గుర్తు చేస్తున్నారు. ‘సేవా’ విభాగంలో ఆయన పేరును ప్రతిపాదించిన నేపధ్యంలో, ఆయన చేసిన సేవా కార్యక్రమాలను, ప్రభుత్వం ఇవ్వక పోవడం వల్లనే గవర్నర్ నామినెట్ ప్రతిపాదనను తిరస్కరించారని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. 

అలాగే, మంత్రి కేటీఆర్ వ్యవహరం, చదవేస్తే ఉన్నమతి పోయిన్దన్నట్లు ఉందని, ఇంతవరకు దేశంలో రాష్ట్రపతులుగా ఎన్నికైన వారిలో ఒక్క అబ్దుల్ కలాం మినహా మిగిలిన వారందరూ, రాజకీయాల నుంచి వచ్చిన వారే, అదే రాష్ట్రాల గవర్నర్లలోనూ నరసింహన్ వంటి ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా, రాజకీయాల నుంచి వచ్చినవారే ఉన్నారు. అదీగాక, గవర్నర్ నియామకానికి, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకానికి కూడా, రాజ్యాంగమే అర్హతలు నిర్దేశించింది. ఆ నిబంధనల ప్రకారమే గవర్నర్ కౌశిక్ రెడ్డి ప్రతిపాదనను తిరస్కరించారని బీజీపీ వర్గాలు బావిస్తున్నాయి. 

అదలా ఉంటే గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య సాగుతున్న వివాదాన్ని రాజకీయ వివాదంగానే చూడాలని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రం పై యుద్ధం ప్రకటించిన తర్వాతనే, రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం పెరిగిందని, విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అయితే, రాజకీయ వివాదాన్ని రాజ్యాంగ సంక్షోభం దాకా తీసుకుపోవడం ఉచితం కాదని, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, ఢిల్లీ వంటి మరికొన్ని రాష్ట్రాలలోనో ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య విబేధాలు ఉన్నా, ఇంతలా బజారున పడలేదని, ప్రోటోకాల్ ఉల్లంఘనలు, ఉద్దేస పూర్వకంగా గవర్నర్’ ను అవమానించడం లేదని అంటున్నారు. అలాగే, ఇప్పటికే  ఈ విషయంలో సెల్ఫ్ గోల్ చేసుకున్న కేటీర్ , తెరాస ఈవ్యవహరానికి ఇక్కడితో చుక్క పెడితే మంచిదని, అంటున్నారు .అదొకటి అలా ఉంటే, రాజ్యాంగ వ్యవస్థల మధ్య రాజకీయ వివాదం తలెత్తడం శ్రేయస్కరం కాదని అంటున్నారు. అయితే, ఈ వివాదం ఇప్పట్లో సమసి పోదనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వినవస్తోంది.