తెలంగాణ సంబరాలకు ప్రణబ్, మోడీ?
posted on Jun 6, 2014 2:53PM
తెలంగాణలో అధికారం చేపట్టిన టీఆర్ఎస్ భారీ స్థాయిలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. తెలంగాణ ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి సాధించబోతోందని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్లో రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఎల్జేఎస్ సిస్టమ్స్ ముందుకు వచ్చిందని ఆయన వెల్లడించారు. పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని, త్వరలో తెలంగాణ పారిశ్రామిక పాలసీని ప్రకటించబోతున్నామని అప్పుడు తెలంగాణ ప్రాంతంలోకి పెట్టుబడులు వెల్లువలా వచ్చి పడతాయని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో పెట్టుబడులు, ఉపాధి కల్పనపై పూర్తి స్తాయిలో దృష్టి పెడతామని కేటీఆర్ చెప్పారు.