జారి పడి గాయపడ్డ కేటీఆర్.. మూడు వారాలు విశ్రాంతి
Published on: Sun Jul 24, 2022 7:25AM
టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గాయపడ్డారు. ప్రగతి భవన్ లో ఆయన ప్రమాద వశాత్తూ జారి పడటంతో ఎడమ కలి మడమ వద్ద హెయిర్ లైన్ ప్రాక్చర్ అయ్యింది. దీంతో వైద్యులు మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని పేర్కొన్నారు.
ఆదివారం నాడు ఆయన జన్మదినం కావడంతో అభిమానులు క్యాడర్ ఘనంగా జరపాలని భావించినప్పటికీ ఆయన రాష్ట్రంలో భారీ వరదలు, వర్షాల నేపథ్యంలో జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన ఆయన గిఫ్ట్ ఏ స్మైల్ కింద బాధితులకు చేతనైన సహాయం చేయాలని కేడర్ కు, అభిమానులకు సూచించారు. జన్మదినానికి ముందు రోజు ఆయన గాయపడటంతో పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్విట్టర్ వేదికగా పలువురు పేర్కొన్నారు.
ఇలా ఉండగా తనకు అనుకోని విశ్రాంతి దొరికిందంటూ కేటీఆర్ సరదా ట్వీట్ చేసి..ఓటీటీలో మంచి సినిమాలు చూస్తాననీ నెటిజన్లకు చెప్పారు. మంచి సినిమాలూ, కార్యక్రమాలను సూచించాలని కోరారు. మొత్తం మీద ఓ మూడు వారాల పాటు కేసీఆర్ టెలికాన్ఫరెన్స్ లకు మాత్రమే పరిమితమౌతారు. ఆయన ప్రత్యక్షంగా ఎటువంటి కార్యక్రమాలకూ హాజరయ్యే అవకాశం లేదు. నిజానికి ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన నేపథ్యంలో కేటీఆర్ రాష్ట్ర వ్యవహారాలన్నీ తానై చేస్తున్నారు.
విపక్షాలపై విమర్శల దూకుడు పెంచారు. ప్రారంభోత్సవాలు, పార్టీ వ్యవహారాలూ అన్నిటినీ తన భుజస్కంధాలపై వేసుకుని చేస్తున్నారు. ఈ తరుణంలో ఆయన ఓ మూడు వారాలు ప్రత్యక్షంగా ఏ కార్యక్రమంలోనూ పాల్గొనకపోవడం టీఆర్ఎస్ కు ఒక విధంగా ఇబ్బందే అని చెప్పాలి. కాగా మంత్రి హరీష్ రావు కేటీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు.


