TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులపై ధ్వజమెత్తిన కేటీఆర్

Published on: Tue Apr 7, 2026 2:19PM

పరిగి భూసేకరణ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతల అరెస్టులను, గృహనిర్బంధాలను ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఖండించారు.  కాంగ్రెస్ ప్రభుత్వం పిరికిపంద చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.  పరిగి నియోజకవర్గంలో తమ భూములను కాపాడుకోవడానికి పోరాడుతున్న రైతులకు మద్దతు తెలపడం నేరమా అని ప్రశ్నించిన కేటీఆర్..  మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.  అరెస్టులు, జైళ్లు, అక్రమ కేసులు బీఆర్ఎస్ నాయకులకు కొత్తేమీ కాదనీ,  తెలంగాణ ఉద్యమ కాలం నుండి ఇలాంటి   ఆంక్షలెన్నో ఎదుర్కొన్నామన్నారు. బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ప్రజాపక్షమేనని ఉద్ఘాటించిన కేటీఆర్.. పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రైతుల అనుమతి లేకుండా సాగిస్తున్న బలవంతపు భూసేకరణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పోరాడుతుందనీ, బాధితులకు అండగా నిలబడుతుందనీ చెప్పారు. అక్రమంగా నిర్బంధించిన నేతలను వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.