బిజెపిలోకి కృష్ణంరాజు

 

 

 

సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు తిరిగి సొంతగూటికి చేరారు. ఆయన బుధవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరిన కృష్ణంరాజు రాజమండ్రి నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తరువాత కొద్ది రోజులుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న కృష్ణంరాజు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తిరిగి పాత పార్టీలోనే చేరేందుకు నిర్ణయించుకున్నారు.ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ మళ్లీ బీజేపీలో చేరడం, పాత మిత్రులందరినీ కలవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజా ఆకాంక్షల మేరకు మళ్లీ బీజేపీలో చేరుతున్నానని స్పష్టం చేశారు. గతంలో బీజేపీతరపున లోక్‌సభకు ఎన్నికైన కృష్ణం రాజు.. కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.