TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కృష్ణాజిల్లాలో వైసీపీ మొత్తం ఖాళీ కానుందా?

Published on: Thu Sep 24, 2015 6:02PM

కృష్ణాజిల్లా వైసీపీలో మొదలైన ముసలం బ్లాస్ట్ అయ్యేలా కనిపిస్తోంది, ఉన్నకొద్దిమంది నేతల్లోనూ ఒకరంటే ఒకరికి పడటం లేదు, పేర్ని నాని, బూరగడ్డ వేదవ్యాస్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది, పరస్పరం బురదజల్లుకునే పనిలో బిజీగా ఉన్నారు. జిల్లాలోని టీడీపీ, బీజేపీ ముఖ్యనేతలకు బూరగడ్డ ఫోన్లు చేశారని తెలుసుకున్న పేర్ని నాని వేదవ్యాస్ పై బురదజల్లే కార్యక్రమం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది, దాంతో  కృష్ణాజిల్లా వైసీపీలో బూరగడ్డ, పేర్ని నాని గోల ఎక్కువైపోయిందని మిగతా నేతలు తిట్టుకుంటున్నారట, మరోవైపు దేవినేని నెహ్రూని పార్టీలోకి తీసుకొస్తారనే ప్రచారం జరగడంతో మరికొంతమంది వైసీపీ ముఖ్యనేతలు దుకాణం సర్దేయడానికి సిద్ధమవుతున్నారట

గత ఎన్నికల్లో కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన బూరగడ్డ వేదవ్యాస్...జగన్ పై తీవ్ర అసంతప్తితో ఉన్నారట, జగన్ తీరుతో విసిగిపోయిన బూరగడ్డ వైసీపీకి గుడ్ బై చెప్పేయాలని డిసైడైయ్యారని తెలుస్తోంది, ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత అయినా అధినేత తీరులో మార్పు వస్తుందని ఆశించానని, కానీ జగన్ వైఖరి మాత్రం మారలేదని వేదవ్యాస్ వాపోతున్నారట, జగన్ ఇకముందు కూడా మారతాడనే నమ్మకం లేదని, ఇక ఈ పార్టీలో ఉండలేనని అనుచరులతో తేల్చిచెప్పారట. 

ఇదిలా ఉంటే, కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని నెహ్రూ వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరగడంతో కొడాలి నాని, వంగవీటి రాధాలు అధినేతకు అల్టిమేటం పంపినట్లు తెలుస్తోంది. నెహ్రూని పార్టీలోకి తీసుకుంటే...మా దారి మేం చూసుకుంటామంటూ తేల్చిచెప్పారట, దాంతో దేవినేని నెహ్రూ వ్యవహారాన్ని సెలైంట్ గా డీల్ చేయాలని బొత్సకు జగన్ కు బాధ్యతలు అప్పగించారట, నెహ్రూ పార్టీలోకి వస్తే ఆ కమ్యూనిటీ నుంచి మరికొందరు వైసీపీలో చేరతారని జగన్ భావిస్తున్నారని, అదే కనుక జరిగితే కొడాలి నాని, వంగవీటి రాధాలు వైసీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమని అనుకుంటున్నారు

దాంతో కృష్ణాజిల్లాలో వైసీపీ పరిస్థితి ఒకరు ఇన్...ముగ్గురు ఔట్ అన్నట్లుగా ఉందని చెప్పుకుంటున్నారు. పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు హ్యాండిస్తారో తెలియడం లేదని ఉందని జగన్ కూడా తల పట్టుకుంటున్నారట, పైగా నేతలంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తుండటంతో కృష్ణాజిల్లాలో వైసీసీ గ్రాఫ్ రోజురోజుకీ పడిపోతోందని, రాజధాని ఏర్పాటుతో రాష్ట్రానికి గుండెకాయలా మారుతున్న కృష్ణాజిల్లాలో పార్టీ గ్రాఫ్ పడిపోతుండటంతో  జగన్ కు నిద్రపట్టడం లేదట.