జగన్ పంచన చేరనున్న కుక్కలా నాగేశ్వరరావు
Published on: Mon Apr 16, 2012 11:10AM
క్రిష్ణాజిల్లా మాజీ జిల్లాపరిషత్ చైర్మన్ కుక్కలా నాగేశ్వరరావు ఉప ఎన్నికల తరువాత వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. విశాఖపట్నంలో ఎస్.కె. షిప్పింగ్ సంస్థను నెలకొల్పిన తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన నాగేశ్వరరావు జిల్లా పరిషత్తు చైర్మన్ గా ఎన్నికయ్యారు. అయితే ఆయన ఆ పదవిలో ఉన్నంతకాలం అసహనంగానే ఉన్నారు. అనేక అవమానాలకు కూడా గురయ్యారు. పార్టీలోని ఎ వరమూ ఆయనను పట్టించుకోలేదు.
అందుకే జెడ్.పి. చైర్మన్ పదవీకాలం ముగిసిన వెంటనే ఆయన పార్టీ కార్యకలాపాలకు విరామం ప్రకటించి సొంతపనులు మాత్రమే చేసుకుంటున్నారు. మారుతున్న సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ లో తనకు ఇకపై ఎటువంటి గుర్తింపు ఉండదన్న భావణతో ఆయన వున్నారు. లోక్ సభ టిక్కెట్టును ఆశిస్తున్న ఆయన ఉప ఎన్నికల తరువాత జగన్ పార్టీలో చేరాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం కృష్ణాజిల్లాలోని బందరు, విజయవాడ లోక్ సభ స్థానాలకు తగిన అభ్యర్థుల కోసం వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అన్వేషిస్తోంది. బందరు లోక్ సభ సీటుపై కన్నేసిన నాగేశ్వరరావు ఇప్పటికే ఒకసారి జగన్ ను వ్యక్తిగతంగా కలిసినట్టు తెలిసింది.


